గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 డిశెంబరు 2020 (09:12 IST)

ట్రైన్‌సెట్స్ తయారీ కోసం చైనా కంపెనీ బిడ్... షాకిచ్చిన ఇండియన్ రైల్వే

వందే భారత్ కింద భారతీయ రైల్వే శాఖ అత్యాధునిక రైళ్లను నడుపుతోంది. వీటిని మినీ బుల్లెట్ రైళ్లుగా అభివర్ణిస్తున్నారు. ఈ రైళ్ళ కోసం కొత్త ట్రైన్ సెట్స్‌ను భారతీయ రైల్వే తయారు చేస్తోంది. 
 
ఈ విషయం తెలుసుకున్న చైనా కంపెనీ ఒకటి వందేభారత్ ట్రైన్‌సెట్స్ తయారీ ప్రాజెక్టు కోసం బిడ్ దాఖలు చేసింది. ఈ కంపెనీకి భారతీయ రైల్వే షాకిచ్చింది. బిడ్ దాఖలు చేసే అర్హత దానికి లేదంటూ తిరస్కరించింది. 
 
ఈ ప్రాజెక్టు విలువ రూ.1,800 కోట్లు కాగా, ఇందులో భాగంగా 44 ట్రైన్స్ సెట్స్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇండియన్ రైల్వే టెండర్లు ఆహ్వానించగా, బీహెచ్‌ఈఎల్, మేధాసెర్వో డ్రైవ్స్, సీఆర్ఆర్‌సీ-పయనీర్ ఎలక్ట్రిక్ ఇండియాలు బిడ్లు దాఖలు చేశాయి.
 
సీఆర్ఆర్‌సీ-పయనీర్ సంస్థ బీజింగ్‌కు చెందిన సీఆర్ఆర్‌సీ యోగ్జి ఎలక్ట్రిక్ లిమిడెట్, భారత్‌కు చెందిన పయనీర్ ఫిల్-మెడ్ లిమిటెడ్ జాయింట్ వెంచర్. వందేభారత్ ట్రైన్స్ సెట్స్ తయారీ కాంట్రాక్ట్ దక్కించుకోవాలంటే ఆ సంస్థ మూలాలు భారత్‌లో ఉండాలి. 
 
అయితే, సీఆర్ఆర్‌సీ-పయనీర్ ఎలక్ట్రిక్ ఇండియా మూలాలు చైనాలో ఉండడంతో ఆ సంస్థ దాఖలు చేసిన బిడ్‌ చెల్లదని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ రేసులో బీహెచ్‌ఈఎల్, మేధాసెర్వో డ్రైవ్స్ మాత్రమే మిగిలాయి.