గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జులై 2021 (16:56 IST)

కొత్త ఒప్పందాలకు ఫుల్‌స్టాఫ్ - మాస్టర్ కార్డ్‌కు ఆర్బీఐ షాక్

దేశంలోని ప్రముఖ పేమెంట్ గేట్‌ వే సంత్థ మాస్టర్ కార్డుకు భారతీయ రిజర్వు బ్యాంకు తేరుకోలేని షాకిచ్చింది. ఈ నెల 22వ తేదీ నుంచి కొత్త సంస్థలతో ఆర్థిక సేవలకు బ్రేక్ వేసింది. 
 
ముఖ్యంగా, బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు కొత్త డెబిట్, క్రెడిట్ కార్డుల జారీకి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఆర్‌బిఐ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్టర్ కార్డ్ కొత్త బ్యాంకులకు కార్డులను జారీ చేయడాన్ని ఆర్బీఐ నిషేధించింది. ఆర్‌బిఐ తీసుకున్న ఈ నిర్ణయం జూలై 22 నుంచి అమల్లోకి వస్తుంది.
 
నిజానికి బ్యాంకులు జారీ చేసే డెబిట్, క్రెడిట్ కార్డులను పలు పేమెంట్ గేట్ వే కంపెనీలు తయారు చేస్తాయి. వీటిలో మాస్టర్ కార్డ్ ఆసియా/పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ (మాస్టర్ కార్డ్) ప్రముఖమైనంది. మాస్టర్ కార్డ్ పేమెంట్ గేట్ వే సిస్టమ్ ఆపరేట‌ర్‌గా ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. అలాగే మన దేశంలోనూ కూడా సేవలు అందిస్తూ వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఈ నెల 22 నుండి అమల్లోకి తెస్తున్న నిబంధనల ప్రకారం మాస్టర్ కార్డ్ ఆసియా/పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త దేశీయ డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కస్టమర్లను తన కార్డు నెట్‌వర్క్‌లో చేర్చుకోవడాన్ని నిషేధించింది.
 
పేమెంట్ గేట్ వే డేటాను నిల్వ చేయడంలో ఆర్‌బిఐ నిబంధనలను కంపెనీ ఉల్లంఘించిందని తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అందుకే మాస్టర్‌కార్డ్‌ను నిషేధించాలని ఆర్‌బిఐ నిర్ణయించినట్లు పేర్కొంది. చెల్లింపు సెక్షన్ 17 , సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 కింద ఈ పరిమితి విధించినట్లు తెలిపింది.
 
ఆర్బీఐ నివేదిక ప్రకారం, కార్డు జారీ చేసే సంస్థలకు చాలా కాలంగా దీని గురించి హెచ్చరిస్తున్నారు."తగినంత అవకాశం ఇచ్చినప్పటికీ, పేమెంట్ గేట్ వే డేటాను నిల్వ చేయడానికి సూచనలను కంపెనీ పాటించడం లేదు" అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.