బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (13:57 IST)

బ్యాంకుల విలీనం.. దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా పీఎన్‌బీ

దేశంలో మరోమారు జాతీయ బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తయింది. మొత్తం 10 బ్యాంకులు నాలుగు ప్రధాన బ్యాంకులుగా అవతరించాయి. ఈ బ్యాంకుల విలీనంతో దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా పంజాబ్ నేషనల్ బ్యాంకు అవతరించింది. ప్రస్తుతం దేశంలో భారతీయ స్టేట్ బ్యాంకు అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న విషయం తెల్సిందే. 
 
కాగా, కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయంలో భాగంగా, దేశంలో ఉన్న పది ప్రధాన బ్యాంకులు నాలుగు బ్యాంకులుగా అవతరించాయి. వీటిలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి విలీనం చేశారు. 
 
ఈ బ్యాంకుల వినియోగదారులందరూ ఇకపై పీఎన్బీ కస్టమర్లుగానే చలామణి కానున్నారు. ఈ విలీనం తర్వాత పీఎన్బీకి మొత్తం 11 వేలకు పైగా శాఖలు, 13 వేలకు పైగా ఏటీఎంలు, దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు. బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు రూ.18 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
 
అలాగే, సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో విలీనం చేశారు. ఫలితంగా ఇది నాలుగో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. అదేవిధంగా అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకులోనూ, ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంకులోను విలీనం చేశారు. దీంతో దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా పీఎన్బీ అవతరించింది. ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంకుల బ్రాంచులన్నీ నేటి నుంచి పీఎన్బీ బ్రాంచులుగా కార్యకలాపాలను నిర్వహించనున్నాయి.