గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 5 జులై 2019 (14:12 IST)

బ్యాంక్ పరీక్షలన్నీ ఇక తెలుగులో రాసుకోవచ్చు- నిర్మలా సీతారామన్ శుభవార్త

నిరుద్యోగులు ఎంతో కాలంగా విజ్ఞప్తి చేస్తున్న డిమాండ్ ఇన్నాళ్లకు నెరవేరింది. తెలుగు రాష్ట్రాల ఉద్యోగార్థులకు కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఇక బ్యాంక్ పరీక్షలన్నీ తెలుగులోనే రాసుకోవచ్చునని ప్రకటించారు. 
 
ఇందులో భాగంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్‌బీ) కు సంబంధించి స్కేల్‌-1 అధికారులు, కార్యాలయ సహాయకుల పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు చేపట్టే పరీక్షలను ఇకపై ఆంగ్లం, హిందీతోపాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ వెల్లడించారు. ప్రాంతీయ భాషల్లో నైపుణ్యముండే వారు ఉద్యోగం సాధించే విషయంలో ఈ నిర్ణయం బాగా ఉపయోగపడుతుందని ఆమె గురువారం పార్లమెంటులో ప్రకటించారు. 
 
ఇప్పటివరకు ఈ పరీక్షల్ని కేవలం ఆంగ్లం, హిందీల్లో మాత్రమే నిర్వహిస్తుండడంతో స్థానిక భాషల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులు నష్టపోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇకపై.. తెలుగు, అస్సామీ, బంగ్లా, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూల్లో కూడా నిర్వహించనున్నారు. ఈ నిర్ణయం సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ-8(2019) మెయిన్స్‌ పరీక్ష నుంచి అమలు కానుంది.