1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 నవంబరు 2021 (15:54 IST)

చెన్నైలో కుండపోత వర్షం : రెడ్ అలెర్ట్ ప్రకటన

చెన్నై మహానగరంలో కుండపోత వర్షం కురుస్తుంది. శనివారం రాత్రి నుంచి ఆదివారమంతా ఈ వర్షం కురుస్తూనేవుంది. దీంతో చెన్నై నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఈ వర్షం ఇంకా మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో చెన్నైతో పాటు... కాంచీపురం, తిరువళ్ళూరు, చెంగల్పట్టు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. 
 
అంతేకాకుండా, రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాలకు సబ్‌వేలు నీటమునిగాయి. దీంతో అధికారులు సబ్‌వేలను మూసివేసినట్లు తెలుస్తోంది. అటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టారు.
 
మరోవైపు వరద సహాయక చర్యలకు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. చెన్నై, చెంగల్పట్టు జిల్లాలతోపాటు తిరువళ్లూరు జిల్లాలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. దంచికొడుతున్న వానలకు రిజర్వాయర్లు నిండుకుండను తలపిస్తున్నాయి. కాగా ఎడతెరిపి లేకుండా పడుతున్న కుండపోత వానలకు పలు జిల్లాలు వణికిపోతున్నాయి.