గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 నవంబరు 2020 (15:40 IST)

97మంది టీచర్లకు.. 27మంది విద్యార్థులకు కరోనా.. ఒక్కరోజులోనే 124 కేసులు

ఏపీలో పాఠశాలలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ కరోనా కలవరం మొదలైంది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో బుధవారం 97 మంది ఉపాధ్యాయులు, 27మంది విద్యార్థులకు వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. ఒక్కరోజులోనే 124 కేసులు నమోదవడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. 
 
కాగా.. తూర్పుగోదావరి జిల్లాలో మరో 8 మంది విద్యార్థులు కరోనా బారినపడగా.. ఓ ఉపాధ్యాయుడు కొవిడ్‌తో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. 
 
ముమ్మిడివరం మండలం సీహెచ్‌ గున్నేపల్లి జడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గాలిదేవర త్రినాథరావు (45) బుధవారం కరోనాతో మృతిచెందారు. ఇటీవల ఆయనకు వైరస్‌ సోకడంతో కొన్నిరోజులుగా అమలాపురం కిమ్స్‌ కొవిడ్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. 
 
అంబాజీపేట మండలం కె.పెదపూడి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, తొండంగి మండలం ఏవీ నగరం ఉన్నత పాఠశాల, కాట్రేనికోన మండలం చెయ్యేరు హైస్కూల్‌లలో ఒక్కో విద్యార్థికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కె.గంగవరం మండలం కుందూరు ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులు, దంగేరు ఉన్నత పాఠశాలలో ఒక విద్యార్థికి తాజాగా కోవిడ్‌ సోకింది.