శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 మే 2020 (22:09 IST)

కరోనా నుంచి చెన్నై కోలుకునేనా? ఒక్క రోజే 743 పాజటివ్ కేసులు

కరోనా వైరస్ నుంచి చెన్నై మహానగరం ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా ఒక్క చెన్నై నగరంలోనే కరోనా కేసుల సంఖ్య వేలకు వేలు పెరిగిపోతున్నాయి. బుధవారం కూడా కొత్తగా 743 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుని ఒక్క చెన్నైలోనే మొత్తం కరోనా కేసుల సంఖ్య 8228కు చేరుకున్నాయి. అలాగే, 59 మంది చనిపోగా, 2823 మంది రోగులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఇకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 13191కు చేరింది. కరోనా వల్ల ఇప్పటివరకూ 87 మంది మరణించారు. తమిళనాడులో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,219. మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చిన వారిలో బుధవారం 83 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే సుమారుగా 60 శాతం కేసులు నమోదుకావడం ఇపుడు ఆందోళన కలిగిస్తోంది. 
 
మరోవైపు, కొత్త పాజిటివ్ కేసులో ప్రతి రోజూ వందల సంఖ్యలో నమోదవుతుంటే.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లాక్డౌన్ ఆంక్షలను గణనీయంగా సడలించింది. ఇప్పటికే మద్యం షాపులు తెరిచింది. అలాగే, సిటీ బస్సులను కూడా నడుపుతోంది. త్వరలోనే ప్రైవేటు బస్సులను కూడా నడిపేందుకు సిద్ధమవుతోంది. పైగా, చెన్నైలో కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న కోయంబేడు మార్కెట్‌ను తిరిగి తెరిచేందుకు సీఎండీఎం (చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. ఇలాంటి చర్యల వల్ల కరోనా కాంటాక్ట్ కేసులు పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు.