1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (18:51 IST)

ఆ రాష్ట్రాల్లో మాస్క్‌లు తప్పనిసరి.. మద్రాస్ ఐఐటీలో 12 మందికి పాజిటివ్

Mask
Mask
కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ఓ రాష్ట్ర ప్రభుత్వం ఏడు జిల్లాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేసులు త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతున్నాయి.  కరోనా నివారణకు ఫేస్ మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని చండీగఢ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు పేర్కొన్నాయి. 
 
ముఖ్యంగా ఢిల్లీ, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో కేసుల పెరుగుదలలో వేగం క‌నిపిస్తోంది. దీంతో ఆందోళ‌న మొద‌లైంది. మ‌ళ్లీ ఆంక్ష‌లు విధించ‌డం ప్రారంభమైంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాజధాని లక్నోతో పాటు ఎన్‌సీఆర్ జిల్లాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. 
 
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఒడిశా రాష్ట్రం కూడా మాస్కును తప్పనిసరి చేసింది. అలాగే పంజాబ్, హర్యానా, తమిళనాడులో మళ్లీ మాస్క్ ధరించాల్సిందేనని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. పై రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు మాస్క్‌లు ధరించాల్సిందేనని ఆరోగ్య శాఖ హెచ్చరించింది 
 
ఇకపోతే.. తమిళనాడు రాష్ట్రంలోని ఐఐటీ మద్రాస్‌లో 12 మందికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తప్పని సరిగా మాస్కులు ధరించాలని  రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి స్పష్టం చేశారు. 
 
తమిళనాడులో బుధవారం కొత్తగా 31 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ జాగ్రత్తలను సీరియస్‌గా తీసుకోవాలని ఆయన సూచించారు.