1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (15:46 IST)

ఐపీఎల్ 2022-ఢిల్లీకి కష్టాలు.. నలుగురు క్రికెటర్లకు కరోనా

corona
ఐపీఎల్ 2022లో కరోనా కలకలం రేపుతోంది. నలుగురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఢిల్లీ జట్టుకు కష్టాలు తప్పేలా లేవు.  ఇప్పటికే ఢిల్లీ ఫిజియో ప్యాట్రిక్‌ ఫార్‌హర్ట్‌ పాజిటివ్‌గా తేలడంతో ఈ సీజన్‌లో తొలి కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ కూడా సోమవారం ఆసుపత్రి పాలయ్యారు. ప్యాట్రిక్‌, మార్ష్‌ కాకుండా జట్టు డాక్టర్‌ అభిజిత్‌ సాల్వి, మసాజర్‌ కూడా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. మార్ష్‌ కాకుండా మిగతా ఆటగాళ్లందరికీ రెండు ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లోనూ నెగెటివ్‌గా వచ్చింది. దీంతో బుధవారం పంజాబ్‌తో ఢిల్లీ మ్యాచ్‌ను యధావిధిగా నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. 
 
''మార్ష్‌కు తొలి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది. కానీ రెండో పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. మిగతా ఆటగాళ్లందరూ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌గా తేలారు. ఢిల్లీ -పంజాబ్‌ మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు'' అని ఓ సీనియర్‌ బిసిసిఐ అధికారి తెలిపారు.
 
వివిధ జట్లలోని ఆటగాళ్లకు కరోనా సోకడంతో గతేడాది భారత్‌లో టోర్నీని వాయిదా వేసి.. అనంతరం సెప్టెంబర్‌- అక్టోబర్‌ మధ్యలో యుఎఇలో నిర్వహించిన సంగతి తెలిసిందే.