1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (09:38 IST)

ఢిల్లీ క్యాపిటల్స్ అలవోక విజయం - 8వ స్థానానికి పంజాబ్

david warner
ఐపీఎల్ 15వ సీజన్ పోటీల్లో భాగంగా బుధవారం రాత్రి ముంబైలో జరిగిన మరో లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు అలవోక విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ జట్టు నిర్ధేశించిన 116 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయిన ఛేదించింది. మరోవైపు, ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి దిగజారిపోయింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు వరుసగా క్యూ కట్టారు. జట్టులో జితేష్ శర్మ చేసిన 32 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. 
 
ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ 24, షారూక్ ఖాన్ 12, రాహుల్ చాహర్ 12 చొప్పున పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్లలో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేక పోయారు. ఫలితంగా ఆ జట్టు 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. 
 
ఆ తర్వాత 116 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు కేవలం 10.3 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ పృథ్వీషా 20 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 41 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్ 30 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిర్సర్ బాది 60 పరుగులు చేశారు. ఫలితంగా తొలి వికెట్‌కు ఏకంగా 83 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
 
షా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 12 పరుగులు చేసి వార్నర్‌కు అండగా నిలిచాడు. దీంతో ఢిల్లీ జట్టు 9 వికెట్లతో విజయభేరీ మోగించింది. బౌలింగ్‌ పొదుపుగా చేసిన కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.