ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (11:25 IST)

ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న భారత సంతతి క్యూరేటర్

దుబాయ్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది. దీంతో భారత క్రికెటర్లు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అనుకోని విషాదం ఒకటి జరిగింది. భారతసంతతికి చెందిన పిచ్‌ క్యూరేటర్‌ మోహన్‌ సింగ్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
అబుదాబి వేదికగా ఆదివారం జరిగిన న్యూజిలాండ్‌ - అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌కు ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అబుదాబి క్రికెట్ మైదానం చీఫ్ క్యూరేటర్‌గా సేవలు అందిస్తున్న భారత సంతతికి చెందిన మోహ్ సింగ్ ఆదివారం ఉదయమే పిచ్‌ను పర్యవేక్షించి గ్రౌండ్‌ సిబ్బందికి సూచనలు అందజేసిన ఆయన ఆతర్వాత తన గదికి వెళ్లిపోయాడు. అయితే ఆ తర్వాత బయటకు రాలేదు. దీంతో అనుమానమొచ్చిన గ్రౌండ్‌ సిబ్బంది ఆయన గదికి వెళ్లి పరిశీలించగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.
 
ఉత్తరాఖండ్‌కు చెందిన మోహన్‌ సింగ్‌ 2004లో దుబాయికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అంతకుముందు పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న పంజాబ్‌ క్రికెట్‌ స్టేడియం పిచ్‌ క్యూరేటర్‌ (ట్రైనీ)గా సేవలందించారు. దీంతో పాటు గ్రౌండ్‌ సూపర్‌ వైజర్‌, కోచ్‌, సహాయకుడి బాధ్యతలు కూడా నిర్వర్తించారు. 
 
అయితే భారత్‌ సెమీస్‌ అవకాశాలను ప్రభావితం చేసే న్యూజిలాండ్‌ - అఫ్గానిస్తాన్‌ కీలకమైన మ్యాచ్‌ కు ముందు ఆయన మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా ఆగంతకులు హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.