1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (12:01 IST)

తొలి టీ20లో తడబడిన ఇంగ్లండ్ - భారత్ ఘన విజయం

hardik pandya
సౌతాంఫ్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసిన 198 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంగ్లండ్ తడబడింది. దీనికి కారణంగా భారత బౌలర్ హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు తీసి వెన్ను విరిచాడు. దీంతో 50 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఆ తర్వాత 199 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్... 19.3 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. పాండ్యా విసిరిన బంతులను ఎదుర్కోవడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు తడబడ్డారు. 
 
ఫలితంగా ఇంగ్లండ్ జట్టు క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఆ జట్టులో మొయిన్ అలీ చేసిన 36 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. డేవిడ్ మలాన్ 21, హారీ 28, జోర్డాన్ 26, జాసన్ రాయ్ 4, శామ్ కరన్ 4, టైమల్ మిల్స్ 7, రీస్ టోప్లే 9 చొప్పున పరుగులు చేశారు. అయితే, కెప్టెన్ బట్లర్, లివింగ్ స్టోన్, పార్కిన్సన్‌లు వరుసగా డకౌట్ అయ్యారు. 
 
భారత జట్టులో హార్దిక్ పాండ్యా 51 పరుగులు చేశాడు. మొత్తం 33 బంతులను ఎదుర్కొన్న పాండ్యా ఆరు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో ఈ పరుగులు చేశాడు. అలాగే, దీపక్ హుడా 33, సూర్య కుమార్ 39, రోహిత్ శర్మ 14, అక్షర్ పటేల్ 17, దినేశ్ కార్తీక్ 11 చొప్పున పరుగులు చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో అలీ, జోర్డాన్ తలా రెండేసి వికెట్లు తీగా, హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. రెండో టీ మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగనుంది.