శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 8 మే 2019 (17:47 IST)

కోహ్లీ సేన ప్రపంచ కప్ గెలుస్తుందా? లేదా? కపిల్ దేవ్ ఏమన్నారు?

ఈ నెలాఖరు నుంచి ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభంకానుంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఇందుకోసం అన్ని క్రికెట్ జట్లూ సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఈ దఫా ఏ దేశం వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంటుందన్న అంశంపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఓ క్లారిటీ ఇచ్చాడు.
 
ఈసారి వరల్డ్ కప్‌ను గెలుచుకునే సత్తా టీమిండియాకు ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత జట్టులో యువరక్తంతో పాటు అనుభవం సమపాళ్లలో ఉన్నాయని ప్రశంసించిన ఆయన.. అయితే జట్టు కూర్పుతో పాటు అవసరమైన సమయంలో ఆటగాళ్లు రాణించడం చాలా ముఖ్యమని గుర్తుచేశారు.
 
ఈ మెగా ఈవెంట్‌లో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీ ఫైనల్స్‌లో చోటుసాధించే అవకాశం ఉందని అంచనా వేశారు. సెమీస్‌లో నాలుగో బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు పోటీపడే అవకాశం ఉందన్నారు. 
 
ఇక ఈ టోర్నీ న్యూజిలాండ్ లేదా వెస్టిండీస్ సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు హార్దిక్ పాండ్యా జట్టులో ఉండడం భారత క్రికెట్ జట్టుకు కలిసివచ్చే అంశమన్నారు. పాండ్యాను అతని సహజశైలిలో ఆడనివ్వాలని అభిప్రాయపడ్డారు. కాగా, 1983లో కపిల్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు విజయభేరీ మోగించి టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.