1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

న్యూజిలాండ్‌పై క్లీన్‌స్వీప్.. ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానానికి భారత్

team india
ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-0 తేడాతోను, ఇపుడు కివీస్‌తో 3-0 తేడాతో వన్డే సిరీస్‌ను భారత క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. ఈ కారణంగా అంతర్జాతీయ వన్డే ర్యాంకుల్లో రోహిత్ సేన ఏకంగా నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. నిజానికి భారత్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో కివీస్ జట్టు ఓడిపోయింది. అపుడే కివీస్ జట్టు ఐసీసీ ర్యాంకుల్లో తన అగ్రస్థానం కోల్పోయి రెండో స్థానానికి దిగజారింది. అపుడు ఇంగ్లండ్ మొదటి స్థానానికి చేరుకుంది. 
 
ఇపుడు మూడో వన్డే‌లో 90 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టిన టీమిండియా 114 పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకుంది. ఇకపోతే వైట్‌వాష్‌కుగురైన న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియా తర్వాత నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. రెండో స్థానంలో ఇంగ్లండ్, మూడో స్థానంలో ఆస్ట్రేలియాలు ఉన్నాయి. అయితే, టాప్-4 జట్ల మధ్య కేవలం ఒక్కో పాయింట్ మాత్రమే తేడా ఉంది. అందువల్ల ఈ జట్ల స్థానాల్లో త్వరతిగతిన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. 
 
మరోవైపు, మంగళవారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ 101, శుభమన్ గిల్ 112 చొప్పున సెంచరీలు బాదడంతో భారత్ భారీస్కోరు చేసింది. ఆ తర్వాత 386 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 41.2 ఓవర్లలో 295 పరుగులకే అలౌట్ అయింది. ఫలితంగా 90 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. కీవీస్ జట్టులో కాన్వే ఒంటరిపోరాటం చేసి 138 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.