గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 నవంబరు 2019 (16:20 IST)

భళా భారత్ : 150 రన్స్‌కే ఆలౌట్ అయిన బంగ్లాదేశ్

ఇండోర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. ఫలితంగా బంగ్లాదేశ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే అలౌట్ అయింది. ఏ ఒక్క దశలోనూ బంగ్లా బ్యాట్స్‌మెన్స్ భారత బౌలర్ల దూకుడుకు అడ్డుకట్టవేయలేకపోయారు.
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ మొమినుల్ హక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా బంగ్లా కెప్టెన్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలని టీమ్ యాజమాన్యం అంతా నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈ పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమన్నాడు. ప్రపంచస్థాయి బౌలర్లను ఎదుర్కొనేందుకు సన్నద్దమయ్యామని మొమినుల్ తెలిపాడు. 
 
మైదానంలో కాస్త తేమ ఉండడంతో మొదటి రెండు గంటలు బౌలర్లకు ఇబ్బంది కలగవచ్చు. కాగా, బంగ్లా కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. షకీబ్ నిషేదానికి గురైన విషయం తెలిసిందే. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ సైతం గాయం కారణంగా కీలక సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో, బంగ్లా బ్యాటింగ్ విభాగం కాస్త కలవరపడింది. 
 
బంగ్లాదేశ్ జట్టు లంచ్ విరామ సమయానికి 26 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి, 63 పరుగులు సాధించింది. కెప్టెన్ మొమినల్ హక్ (22), ముష్ఫికర్ రహీమ్ (14) క్రీజులో ఉన్నారు. అయితే, భారత బౌలింగ్ ధాటికి వీరు ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేక పోయారు. ఫలితంగా 58.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు తీసి రాణించాడు. ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌కు తలో రెండు వికెట్లు దక్కాయి.