గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 జూన్ 2021 (18:31 IST)

ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ : వరుసగా వికెట్ల పతనం.. కష్టాల్లో భారత్

సౌతాంఫ్టన్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ పోటీ ఫైనల్ పోరులో భారత్ కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజైన ఆదివారం మధ్యాహ్నం లంచ్ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. న్యూజిలాండ్ పేసర్లు విజృంభించడంతో ఆదివారం ఆటలో భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.
 
తొలుత విరాట్ కోహ్లీ (44)ని కైల్ జేమీసన్ వికెట్లు ముందు దొరకబుచ్చుకుని వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (4) కూడా జేమీసన్ బౌలింగ్‌లో వికెట్లకు దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 
 
అప్పటివరకు ఎంతో ఓపిగ్గా ఆడిన రహానే (49)ను, వాగ్నర్ ఓ షార్ట్ బంతితో బోల్తా కొట్టించాడు. అయితే, ఈ దశలో అశ్విన్, జడేజా జోడీ కాస్త వేగంగా ఆడేందుకు ప్రయత్నించింది. ముఖ్యంగా, అశ్విన్ 27 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. 
 
కానీ, దురదృష్టవశాత్తు సౌథీ బౌలింగ్‌లో ఓ అవుట్ స్వింగ్ ను ఆడే ప్రయత్నంలో అశ్విన్ తన వికెట్ ను సమర్పించుకున్నాడు. దాంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా (15 బ్యాటింగ్), ఇషాంత్ శర్మ (2 బ్యాటింగ్) ఉన్నారు. కివీస్ బౌలర్లలో జేమీసన్ 3 వికెట్లు తీయగా, నీల్ వాగ్నర్ కు 2 వికెట్లు లభించాయి. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ దక్కించుకున్నారు.