1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 నవంబరు 2023 (08:38 IST)

నేడు కోల్‌కతా వేదికగా రెండు కొదమసింహాల పోరు : భారత్ వర్సెస్ సౌతాఫ్రికా

india vs south africa
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపచం కప్ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కోల్‌కాతా కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో వరుస విజయాలను సాధిస్తూ పాయింట్ల పట్టకలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. భారత్ ఏడు మ్యాచ్‌లు ఆడగా ఏడింటిలో విజయం సాధించి 14 పాయింట్లతో అగ్రస్థానంలో నిలించింది. అలాగే, సౌతాఫ్రికా ఏడు మ్యాచ్‌లు ఆడి ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయి, ఆరు మ్యాచ్‌లలో గెలుపొందింది. ఈ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. భారత్, సౌతాఫ్రికా జట్లు ఇప్పటికే తన సెమీస్ స్థానాన్ని ఖారారు చేసుకున్నట్టే. మున్ముందు ఏదేని అద్భుతం జరిగితే తప్పా... ఈ రెండు జట్లు సెమీస్‌ ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే మ్యాచ్‌లో హోరాహోరీగా సాగనుంది. దీనికి కారణం ఇరు జట్లూ మంచి జోరు మీద ఉండటమే. 
 
ప్రపంచ కప్‌లో తమతో ఢీకొట్టిన ప్రతి జట్టునూ భారత్ చిత్తు చేసింది. అలాగే, సౌతాఫ్రికా కూడా నెదర్లాండ్స్ చేతిలో అనూహ్య పరాజయం మినహాయిస్తే.. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా జోరు మామూలుగా లేదు. ఆస్ట్రేలియాను 134, ఇంగ్లాండ్‌ను 229, న్యూజిలాండ్‌ను 190 పరుగుల తేడాతో ఓడించింది. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు (428/5)ను నమోదు చేయడమే కాక ఇంకో మూడుసార్లు 350+ స్కోర్లు సాధించింది. కాబట్టి సఫారీలతో టీమ్ ఇండియాకు అంత తేలిక కాకపోవచ్చు. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టే గ్రూప్ దశను అగ్రస్థానంతో ముగించే అవకాశముంది.
 
అదేసమంలో ఈ టోర్నీలో పెద్దగా అంచనాల్లేకుండా దక్షిణాఫ్రికా బరిలోకి దిగింది. కానీ, మైదానంలో సాధారణ ప్రదర్శన చేస్తుందంటే బ్యాటర్లదే ప్రధాన పాత్ర. ఈ ప్రపంచకప్ తర్వాత వన్డేల నుంచి రిటైరవబోతున్న డికాక్.. టోర్నీపై బలమైన ముద్ర వేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు శతకాలు బాదేశాడు. వాండర్ డసెన్ రెండు శతకాలు, ఓ అర్థసెంచరీతో ఊపుమీదున్నాడు. క్లాసెన్, మార్ క్రమ్, మిల్లర్ సైతం చెలరేగి ఆడుతున్నారు. 
 
అలాగే, ఈ టోర్నీలో భారత బౌలర్ల జోరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా పేసర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. బుమ్రా ప్రతి మ్యాచ్‌లో కీలక వికెట్లు తీస్తుంటే.. ఆలస్యంగా జట్టులోకి వచ్చిన షమి చెలరేగిపోతున్నాడు. లంకతో మ్యాచ్‌లో సిరాజ్ సైతం జోరందుకున్నాడు. స్పిన్నర్లు కుల్దీప్, జడేజా సైతం నిలకడగా రాణిస్తున్నారు. బలమైన సఫారీ బ్యాటింగ్ దళం బుమ్రా బృందాన్ని ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరం.
 
టోర్నీలో భారత బ్యాటింగ్ కూడా సంతృప్తికరంగా సాగుతోంది. సీనియర్ స్టార్లు రోహిత్, కోహ్లి నిలకడగా రాణిస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్నారు. రాహుల్ కూడా సమయోచితంగా రాణిస్తున్నాడు. శుభ్ర్మన్, శ్రేయస్‌లు విషయంలో కొంత ఆందోళన నెలకొనగా.. లంకపై వీళ్లిద్దరూ చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇంగ్లండ్‌‌పై ప్రతికూల పరిస్థితుల్లో ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడిన సూర్య కూడా ఫామ్ చాటుకున్నాడు. 
 
ప్రస్తుతం ఈడెన్‌లో పరిస్థితులు బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేని నేపథ్యంలో మన బ్యాటర్లు కొంచెం జాగ్రత్తగా ఆడాల్సివుంటుంది. దక్షిణాఫ్రికా పేసర్లలో జాన్సన్, కొయెట్టీ నిలకడగా రాణిస్తున్నారు. ఆ జట్టుకు రబాడ, ఎంగిడిల అనుభవం కూడా కలిసొచ్చేదే. రబాడకు భారత్‌పై మంచి రికార్డుంది. ఈడెన్‌లో స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ముప్పు తప్పకపోవచ్చు. ఈ మ్యాచ్‌కు భారత్ తుది జట్టును మార్చే అవకాశాలు లేనట్లే.
 
కాగా, ప్రపచం కప్‌లో ఈ రెండు జట్లూ ఇప్పటివరకు ఐదు సార్లు తలపడ్డాయి. వీటిలో భారత్ రెండుసార్లు, సౌతాఫ్రికా మూడుసార్లు గెలుపొందాయి. ఓవరాల్‌గా చూస్తే ఇరు జట్లమధ్య 90 వన్డే మ్యాచ్‌లు జరగ్గా 37సార్లు భారత్, 50 సార్లు సఫారీలు గెలుపొందారు. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. 
 
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్దీప్, షమి, బుమ్రా, సిరాజ్.
 
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, వాండర్డ్ సెన్, మార్క్రమ్, క్లాసెన్, మిల్లర్, జాన్సన్, కేశవ్ మహరాజ్, కొయెట్టీ, రబాడ, ఎంగిడి.