1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 4 నవంబరు 2023 (09:02 IST)

భారత బౌలర్లు ఉపయోగిస్తున్న క్రికెట్ బంతిపై విచారణ జరపాలి : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హాసన్ రజా

hasan raja
భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 పోటీల్లో టీమిండియా బౌలర్లు ఉపయోగిస్తున్న బంతిపై విచారణ జరపాలని పాకిస్థాన్ మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ హాసన్ రజా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు విజ్ఞప్తి చేసారు. భారత్ బ్యాటింగ్ చేస్తున్నపుడు బ్యాట్స్‌మెన్ బాగా ఆడుతున్నారని, కానీ, టీమిండియా బౌలింగ్ చేస్తున్న సమయంలో ఇతర జట్లకు చెందిన బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని , ఇలా ఎందుకు జరుగుతుందో అంతు చిక్కడం లేదని హాసన్ రజా సందేహం వ్యక్తం చేశాడు. 
 
ముఖ్యంగా, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేసి చిరస్మరణీయ విజయాన్ని అందించిన నేపథ్యంలో హసన్ రజా ఈ డిమాండ్‌పై తెరపైకి తీసుకురావడం గమనార్హం. భారత బౌలర్ల నుంచి భిన్నమైన దూకుడుని చూశామని రజా అన్నాడు. షమీ, సిరాజ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు మాజీ దిగ్గజాలు అలన్ డోనాల్డ్, మఖాయ ఎంతినీ ఆడుతున్నట్లు అనిపించిందన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో  బంతి మారినట్లు కనిపిస్తోందని రజా అనుమానం వ్యక్తం చేశాడు.
 
ఐసీసీ, అంపైర్ లేదా బీసీసీఐ భారత బౌలర్లకు వేరే బంతిని అందిస్తున్నాయని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. అందుకే బంతులను తనిఖీ చేయాలని తాను భావిస్తున్నట్టు సూచించాడు. వన్డే మ్యాచ్ మూడు స్లిప్లు పెట్టడం, కేఎల్ కీపర్ రాహుల్ కూడా బంతులను అందుకోవడానికి ఇబ్బంది పడుతున్న తీరు చూస్తే బంతుల్లో అదనపు 'లక్క పూత' ఉందనిపిస్తోందని సందేహం వ్యక్తం చేశాడు. ఆ ఆరోపణలు చేసిన రజాపై మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా కౌంటర్ ఇచ్చాడు. అతని చేష్టలను ‘కామెడీ'గా అభివర్ణించాడు.