గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 7 జులై 2019 (11:19 IST)

శ్రీలంకతో మ్యాచ్.. ఏడు వికెట్ల తేడాతో టీమిండియా విజయం

ప్రపంచ కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 265 పరుగుల విజయ లక్ష్యాన్ని 43.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. లీగ్ స్టేజిలో ఆఖరి మ్యాచ్‌ను విజయంతో ముగించిన కోహ్లీసేన 15 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
 
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా ఓపెనర్లు లోకేష్ రాహుల్, రోహిత్ శర్మలు తొలి వికెట్‌కు 189 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రోహిత్‌ శర్మ 94 బంతుల్లో 103(14 ఫోర్లు, 2 సిక్సులు), కేఎల్‌ రాహుల్‌ 118బంతుల్లో 111(11 ఫోర్లు, ఒక సిక్స్) సెంచరీలతో చెలరేగారు.
 
ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ 41 బంతుల్లో 34నాటౌట్‌(3 ఫోర్లు), హార్దిక్ పాండ్య(7నాటౌట్‌)తో కలిసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. శ్రీలంక బౌలర్లలో లసిత్ మలింగ, కసున్ రజిత, ఇసురు ఉదానాలు తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.