1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (07:44 IST)

కమ్మిన్స్ సునామీ - 15 బంతుల్లో 56 రన్స్.. మళ్లీ ఓడిన ముంబై

kkr team
స్వదేశంలో ఐపీఎల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. మైదానంలో బ్యాట్స్‌మెన్లు పరుగుల వరద పారిస్తున్నారు. పోటీపడిమరీ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నారు. బుధవారం జరిగిన కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన ఆటగాడు ప్యాట్ కమ్మిన్సన్ వీరవిహారం చేసి కేవలం 15 బంతుల్లో 56 పరుగులు చేశాడు. దీంతో ప్రత్యర్థి నిర్ధేశించిన విజయలక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలోనే ఛేదించింది. 
 
కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య బుధవారం రాత్రి కీలక మ్యాచ్ జరిగింది. పూణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. సూర్య కుమార్ (52) అర్థసెంచరీతో రాణించాడు. 
 
తిలక్ వర్మ 38 (నాటౌట్), పోలార్డ్ 22 (నాటౌట్) మెరుపులు మెరిపించారు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ 3, ఇషాన్ కిషన్ 14, బ్రేవిస్ 29 చొప్పున పరుగులు చేశారు. దీంతో నిర్మీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. 
 
ఆ తర్వాత  162 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 16 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. కోల్‌కతా ఆటగాడు కమ్మిన్స్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 15 బంతుల్లో నాలుగు  ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశారు. దీంతో 16 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి విజయలక్ష్యాన్ని చేరుకుంది. 
 
మ్యాచ్ ఆఖరులో వెంకటేష్ అయ్యర్ 41 బంతుల్లో ఆరు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టి 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్, మిల్స్ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. అటు బంతితో, ఇటు బ్యాట్‌తో రాణించిన కమిన్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందజేశారు.