1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2015 (16:14 IST)

నేనే మీడియా పర్సనైతే ధోనీ చెంప పగలకొడతా: యోగరాజ్ సింగ్

ఒకవేళ నేనే గనుకు మీడియా పర్సన్ అయితే అక్కడే కెప్టెన్ ధోనీ చెంప పగలకొడతా అని యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ధోనీ చాలా అహంకారి అని యోగరాజ్ ఫైర్ అయ్యాడు. రావణుడి గర్వం ఎలా అయితే ముగిసిందో, అలాగే ఏదోఒక రోజు ధోనీ కూడా ఇబ్బందిపడతాడు. రావణుడి కన్నా మించిన వాడినని తనకు తానుగా అనుకుంటున్నాడని యోగరాజ్ మండిపడ్డారు. 
 
ఇతర క్రికెటర్లు నా వద్దకు వచ్చి ధోనీ గురించి చెప్పినప్పుడు నేను చాలా సిగ్గుపడేవాడిని. అసూయవల్ల ధోనీ అంటే వారికి పడేదికాదని మొదట్లో అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే ధోనీ గురించి క్రికెటర్లు నాకు చెప్పారో, అసలంతటి ఘోరమైన వ్యక్తిని నా జీవితంలో చూడలేదని అనుకుంటున్నా" అని అన్నాడు. గతంలోనే ధోనీపై యోగరాజ్ ఇలానే తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో మరోసారి ధోనీపై మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తనకు విపరీతమైన హైప్ ఇచ్చిన మీడియానే వేళాకోళమాడాడని దుయ్యబట్టాడు. ఓ హిందీ వార్తా చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన యోగరాజ్ ఈ విధంగా అన్నాడు. ధోనీ అంటే అసలేమీలేదని, అతన్ని స్టార్ చేసిన గొప్పదనమంతా మీడియాదేనని పేర్కొన్నాడు.
 
"ఒకానొక సమయంలో తనంటే (ధోనీ) ఏమిలేదు. కానీ ఇప్పుడు మీడియా ముందు కూర్చుని మీడియా వ్యక్తులనే అవహేళన చేస్తున్నాడు. తనకు ఎనలేని హైప్ ఇచ్చిన మీడియాపైనే పరిహాసమాడుతున్నాడు. మ్యాచ్‌లో తను పరుగు తీసినప్పుడు చప్పట్లు కొట్టిన భారత అభిమానులను చూసి నవ్వుతున్నాడు.. అని యోగరాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.