శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 నవంబరు 2020 (18:35 IST)

సానియా మీర్జా భర్త క్రికెట్ కెరీర్ ముగిసినట్టేనా..? (video)

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాలిక్ సుదీర్ఘకాలంగా క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. టెస్టుల్లో గొప్ప ప్రదర్శన ఇవ్వకపోయినా.. వన్డేలు, టీ20ల్లో అద్భుతంగా రాణించాడు. ఇటీవలి కాలంలో వన్డేలకు కూడా దూరమైన మాలిక్ కేవలం టీ20ల మీదనే దృష్టి పెట్టాడు. 
 
తాజాగా అతడిని పలు సిరీస్‌లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పక్కన పెడుతూ వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాలిక్ కెరీర్ ముగిసినట్లేనని చెబుతున్నారు. న్యూజిలాండ్ సిరీస్‌కు కూడా మాలిక్ ను సెలెక్షన్ కమిటీ పట్టించుకోలేదు. కివీస్‌తో సిరీస్ విషయంలో కూడా 38 సంవత్సరాల సీనియర్ ప్లేయర్ ను పక్కన పెట్టడంతో వచ్చే ఏడాది భారత్‌లో జరుగనున్న టి20 వరల్డ్‌కప్‌లో పాల్గొనేది అనుమానంగా మారింది. పాక్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య డిసెంబర్‌ 18, 20, 22 తేదీల్లో 3 టి20 మ్యాచ్‌లు, మౌంట్‌ మాంగనీ (డిసెంబర్‌ 26-30), క్రైస్ట్‌చర్చ్‌ (జనవరి 3-7) వేదికల్లో రెండు టెస్టులు జరుగుతాయి.
 
న్యూజిలాండ్ సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు జంబో టీమ్‌ను పంపనుంది. ఆ జంబో టీమ్‌లో పలువురు యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. అయితే ఆ లిస్టులో షోయబ్ మాలిక్ పేరు కనిపించలేదు. న్యూజిలాండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో షోయబ్‌ మాలిక్‌తో పాటు పేసర్‌ మొహమ్మద్‌ అమీర్‌కు చోటు దక్కలేదు. టి20 క్రికెట్‌ మాత్రమే ఆడుతున్న మాలిక్‌ను జింబాబ్వే సిరీస్‌కు కూడా పక్కనబెట్టారు. దీంతో క్రికెట్ కెరీర్ ముగిసినట్టేనా..? అంటూ క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.