శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 13 నవంబరు 2022 (11:31 IST)

నేడు ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్.. విజేత ఎవరో?

icc mens world cup
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. 
 
లీగ్ దశలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సెమీస్‌లో పటిష్టమైన భారత జట్టును ఓడించిన ఇంగ్లండ్ ఫైనల్‌ పోరుకు అర్హత సాధించింది. అదేసమయంలో లీగ్ దశలో పేలవమైన ప్రదర్శనతో ఇతర జట్ల ఓటమి పుణ్యమాని సమీస్‌కు అర్హత సాధించిన పాకి జట్టు సెమీస్‌లో జూలు విదిల్చి పటిష్టంగా కనిపించింది. లీగ్ దశలో అందరికంటే మిన్నగా ప్రతిభను చాటిన న్యూజిలాండ్ జట్టును పాకిస్థాన్ జట్టు ఓడించి పాక్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. 
 
ఇప్పటివరకు రెండు జట్లూ సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. ఇరు జట్ల బౌలింగ్, బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ కూడా పటిష్టంగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఇరు జట్లూ సెమీస్‌లో బరిలోకి దికిన జట్లతోనే ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టోర్నీలో ఫామ్ లేమితో కనిపించిన పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ మాత్రం సెమీస్ మ్యాచ్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. 
 
అలాగే, ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ కూడా తానెంత ప్రమాదకారినో భారత్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో చేతల ద్వారా నిరూపించాడు. మరోవైపు, పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు ఇప్పటికే ఓ దఫా టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకోగా, ఇపుడు మరోమారు ఎవరు గెలిచినా రికార్డేనని చెప్పక తప్పదు. అయితే, ఈ మ్యాచ్‌కు వరుణ దేవుడు అడ్డుపడే అవకాశం ఉంది.