1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (09:53 IST)

టెస్ట్ కెరీర్‌కు టాటా చెప్పనున్న రవీంద్ర జడేజా?

భారత క్రికెట్ జట్టుతో పాటు.. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్‌లో అత్యంత కీలక సభ్యుడుగా ఉన్న క్రికెటర్ రవీంద్ర జడేజా త్వరలోనే తన టెస్ట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలన్న ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ట్వంటీ20 కెరీర్‌పై దృష్టిసారించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
భారత క్రికెట్ జట్టు ఈ నెలాఖరులో సౌతాఫ్రికాలో పర్యటించాల్సివుంది. ఈ పర్యటనకు ముందు భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. నెట్ ప్రాక్టీస్‌ చేస్తుండగా, తొడ కండరాలు పట్టేశాయి. దీంతో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు, కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వన్డే సిరీస్‌కు దూరం కానున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఇపుడు రవీంద్ర జడేజా టెస్టులకు గుడ్‌బై చెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వన్డేలు, టీ20 ఫార్మెట్లలో ఎక్కువ కాలం తన కెరీర్‌ను కొనసాగించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయ తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, గత నెలలో సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో జడేజా మోచేతికి గాయమైంది. దీంతో సౌతాఫ్రికా పర్యటనకు జడేజాను ఎంపిక చేయలేదు. అంతేకాకుండా మున్ముందు కూడా టెస్టులకు దూరంగా ఉండాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, టెస్టులు, వన్డేలు, టీ20 ఫార్మెట్లలో రవీంద్ర జడేజా తిరుగులేని ఆల్‌రౌండర్‌గా రాణించిన విషయం తెల్సిందే. అటు బౌలింగ్‌తో పాటు... బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అద్భుతంగా రాణిస్తూ జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించారు.