గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (09:28 IST)

యూపీ పోలీసుల వైఖరిపై సుప్రీంకోర్టు అసహనం... విచారణ జరిపే తీరు ఇదేనా...

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసుల వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్రఅసహనం వ్యక్తంచేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్‌ ఖీరీ కేసు విచారణలో బీజేపీ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం వైఖరిని మరోమారు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదని మండిపడింది. తాము ఆశించినట్టుగా విచారణ సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. 
 
ముఖ్యంగా, ఈ కేసులో నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌లను కలిపి విచారించడాన్ని చూస్తుంటే.. పోలీసులు నిందితుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ కోసం.. యూపీ సర్కారు నియమించిన ఒకే సభ్యుడితో కూడిన జ్యుడీషియల్‌ కమిషన్‌పై తమకు విశ్వాసం లేదని తేల్చిచెప్పింది.
 
ఈ కేసును మరో హైకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించేలా ఆదేశాలిచ్చే యోచనలో ఉన్నట్టు తెలిపింది. నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, పారదర్శకంగా కేసు విచారణ జరిగేందుకే ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్టు వెల్లడించింది. దీనిపై శుక్రవారంలోగా (నవంబర్‌ 12) యూపీ ప్రభుత్వం స్పందన తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లీతో కూడిన ధర్మాసనం సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌లో గతనెల 3న రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా వాహన శ్రేణి వారి మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు చనిపోగా, అనంతరం జరిగిన ఘర్షణలో మరో నలుగురు మరణించారు. ఈ కేసులో ఇప్పటికే కేంద్ర మంత్రి కుమారుడుని పోలీసులు అరెస్టు చేశారు.