శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2019 (15:30 IST)

అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నా.. కానీ ఇప్పుడు తపిస్తున్నా.. అంబటి రాయుడు

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించిన హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు.. తన రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం రాయుడు టీఎన్‌సీఏ వన్డే లీగ్‌లో గ్రాండ్‌శ్లామ్‌ జట్టుకు ఆడుతున్నాడు. 
 
మ్యాచ్‌ ముగిసిన తర్వాత అంబటి రాయుడు మీడియాతో మాట్లాడుతూ భారత్‌ తరుఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌‌తో పాటు ఐపీఎల్ ఆడాలని భావిస్తున్నట్టు వెల్లడించాడు. దీంతో అంబటి రాయుడు మనసు మార్చుకున్నాడని క్రికెట్ పండితులు అంటున్నారు. 
 
ప్రపంచ కప్ కోసం ఐదేళ్ల పాటు తీవ్రంగా శ్రమించా. అయినా జట్టులో చోటు లభించకపోతే నిరాశ చెందడం సహజం. అప్పుడు అలాంటి నిర్ణయం తీసుకున్నా. ఆ తర్వాత మళ్లీ ఆలోచించా. తిరిగి భారత్‌ తరపున ఆడాలని తపిస్తున్నానని అంబటి వ్యాఖ్యానించాడు. 
 
ఇకపోతే.. గత రెండేళ్లుగా టీమిండియా తరఫున నిలకడగా ఆడిన రాయుడిని ఎమ్మేస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయలేదు. రాయుడి స్థానంలో విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశారు.
 
దీంతో ప్రపంచకప్‌ను వీక్షించేందుకు ''3డీ'' కళ్లద్దాలు కొనుగోలు చేస్తానని ట్వీట్‌ చేశాడు. ఈ వివాదమే అంబటి రాయుడిని రిటైర్మెంట్ ప్రకటించేలా చేసింది. కానీ ఆపై అంబటి ఆలోచించి నిర్ణయం తీసుకుని క్రికెట్ ఆడాలనే ఆకాంక్షను వెలిబుచ్చాడు.