1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (13:23 IST)

భారత జట్టులో కలకలం : మరో ఇద్దరికి సోకిన కరోనా వైరస్

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టులో కలకలం చెలరేగింది. ఇప్పటికే ఒక క్రికెటర్ కరోనా వైరస్ బారినపడగా, తాజాగా మరో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
నిజానికి ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఈయన ఐసోలేషన్‌లో ఉన్నాడు. తాజాగా మరో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు వైరస్ సోకింది. కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన చాహల్, కృష్ణప్ప గౌతమ్‌లకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
 
కృనాల్ పాండ్యాకు గత మంగళవారం కరోనా పాజిటివ్‌గా తేలగా, అతడితో క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్న ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్డిక్ పాండ్యా, చాహల్, కృష్ణప్ప గౌతమ్, పృథ్వీషా, మనీష్ పాండే, దీపక్ చాహర్ వంటి ఆటగాళ్లను బీసీసీఐ ఐసోలేషన్‌కు తరలించింది. 
 
సోమవారం రాత్రి కృనాల్ పాండ్యాతో కలిసి ఈ 8 మంది భోజనం చేసినట్లు అక్కడి బీసీసీఐ అధికారులు గుర్తించారు. దాంతో మంగళవారమే 8 మందికి ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు నిర్వహించగా.. అందరికీ నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బుధవారం, గురువారం జరిగిన రెండు టీ20 మ్యాచ్‌లకు వీరిని దూరంగా పెట్టారు.
 
అయితే గురువారం నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో చాహల్, గౌతమ్‌లకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా ఇప్పటికే చాహల్‌ క్వారంటైన్‌లో​ ఉండగా.. తాజాగా గౌతమ్‌ను కూడా ఐసోలేషన్‌కు పంపించారు. వీరిద్దరూ కొలంబోలోని ఓ నక్షత్ర హోటల్‌లో ఉంటున్నారు.