శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (13:51 IST)

వైజాగ్ లాడ్జీలో ప్రేమజంట బలవన్మరణం.. ఎక్కడ?

మరో ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. సోమవారం లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్న ఈ ప్రేమ జంట మంగళవారం మధ్యాహ్నమైనా బయటకు రాకపోవడంతో లాడ్జీ సిబ్బందికి అనుమానం వచ్చి కిటికీలోనుంచి చూడగా పడకపై విగతజీవులుగా కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. బాత్రూమ్‌లోని కిటికీ ఊచలకు వారు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను దామోదర్ (20), సంతోషి కుమారి (17)గా గుర్తించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్నకొత్తపేట ప్రాంతానికి చెందిన కందివలస దామోదర్ అనే యువకుడు డిగ్రీ చదువుతున్నాడు. ఆముదాలవలస మండలంలోని బలగాం గ్రామానికి చెందిన అదపాక సంతోషి కుమారి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. 
 
చివరకు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని విధంగా గాఢమైన ప్రేమలో మునిగిపోయారు. అయితే, తమ ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలిస్తే వారు అంగీకరించరని భావించిన ప్రేమజంట... సోమవారం మధ్యాహ్నం విశాఖపట్టణంకు చేరుకున్నారు. అక్కడ దరిగొల్లపాలెంలోని ఓ లాడ్జీలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. 
 
మంగళవారం మధ్యాహ్నం అవుతున్నప్పటికీ వారిద్దరూ గది నుంచి బయటకురాలేదు. దీంతో అనుమానించిన లాడ్జీ సిబ్బంది కిటికీలోనుంచి చూడగా వారు విగతజీవులై కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో వారు వారు వచ్చి తలుపులు పగులగొట్టి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. యువతి మెడలో పసుపుతాడును గుర్తించారు. 
 
వీరిద్దరూ పెళ్ళి చేసుకున్న తర్వాత ఆత్మహత్యకు పాల్పడివుంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, వీరి ప్రేమ వ్యవహారం వారి కుటుంబ సభ్యులకు తెలియక పోవడం గమనార్హం. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.