1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: బుధవారం, 29 డిశెంబరు 2021 (20:47 IST)

తిరుపతిలో క్రైం రేటు తగ్గింది, కానీ హత్యలు కిడ్నాప్‌లు మాత్రం: ఎస్పీ అప్పలనాయుడు

గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో క్రైమ్ రేటును తగ్గించామన్నారు అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు.

 
2021 సంవత్సరంలో సమిష్టిగా పనిచేయడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశామన్నారు. అయితే కిడ్నాప్, హత్యలు మాత్రం నగరంలో గతంతో పోలిస్తే ఎక్కువయ్యాయని స్పష్టం చేశారు. తిరుపతి అర్బన్ జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఏ ఒక్క సంఘటన కూడా జరగలేదన్నారు. 

 
అలాగే తిరుపతిలో డిసెంబర్ 31, జనవరి 1న ఆంక్షలు అమల్లో ఉంటాయని.. అర్థరాత్రి పార్టీలకు, ఈవెంట్లకు అనుమతి లేదన్నారు. మద్యం షాపులకు, బార్లకు సమయం పొడిగింపు లేదని.. మద్యం మత్తులో రోడ్డుపై వీరంగం చేసినా, ఫ్లై ఓవర్, బైపాస్ రోడ్లపై రేసింగ్‌లు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరికి వారు ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు.