నీళ్ల టబ్బులో ముంచేసి.. కన్నకొడుకుల ప్రాణం తీసిన తల్లి  
                                       
                  
				  				  
				   
                  				  మాతృదినోత్సవం రోజున దారుణం జరిగింది. భర్త, అత్తతో జరిగిన గొడవతో విచక్షణ కోల్పోయిన ఓ అమ్మ... అభంశుభం తెలియని తన ఇద్దరు కన్నకొడుకులను నీళ్ల టబ్బులో ముంచేసి చంపేసింది. ఆపై విషం తాగి ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రి పాలైంది. హైదరాబాద్ నగరంలోని రాచకొండ కమిషనరేట్ పరిధి జిల్లెలగూడలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. 
				  											
																													
									  
	 
	పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కుబ్యాతండాకు చెందిన నేనావత్ శ్రీనివాస్ (34), భారతి(25)కి 2020లో వివాహమైంది. జిల్లెలగూడలో నివాస ముండే వీరికి విక్కీ (18 నెలలు), లక్కీ (8నెలలు) కుమారులు ఉన్నారు. ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తున్న శ్రీనివాస్.. భారతి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. 
				  
	 
	ఈ క్రమంలో శ్రీనివాస్ తల్లి శనివారం జిల్లెలగూడకు రాగా అత్తాకోడళ్ల మధ్య గొడవ జరిగింది. ఇదేవిషయమై ఆదివారం ఉదయం జిల్లెలగూడ వచ్చిన భారతి తల్లిదండ్రులు కూతురికి అల్లుడికి నచ్చజెప్పి వెళ్లిపోయారు. అనంతరం శ్రీనివాస్ కూడా బయటికి వెళ్లగా... భారతి తన ఇద్దరు కొడుకులని ఓ నీళ్ల టబ్బులో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేసింది. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	అనంతరం తానూ విషం తాగింది ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటికి చేరుకున్న శ్రీనివాస్ పిల్లలను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న భారతి పరిస్థితి సైతం విషమంగా ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.