సోమవారం, 22 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 సెప్టెంబరు 2025 (12:06 IST)

ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కుదిపేస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు

suicide
దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఖరగ్‌పూర్ ఐఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో పరిశోధక విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. తన హాస్టల్ గదిలనే ఉరికి వేలాడుతూ కనిపించడం క్యాంపస్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈ యేడాదిలో ఇది ఐదే ఘటన కావడం గమనార్హం. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన హర్షకుమార్ పాండే (27) అనే విద్యార్థి ఈ విద్యా సంస్థలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం తండ్రి మనోజ్‌ కుమార్‌ పాండే కుమారుడికి ఫోన్ చేయగా ఎంతకీ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం చేరవేయడంతో వారు గదికి వెళ్లి చూడగా లోపం నుంచి తాళం వేసివుంది. దీంతో వారు స్థానిక హిజిలీ పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు అక్కడకు చేరుకుని గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, హర్ష కుమార్ ఫ్యానుకు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే మృతదేహాన్ని క్యాంపస్‌లోనీ బీసీ రాయ్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరిణించినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనతో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఈ యేడాది ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఖ్య ఐదుకు చేరుకుంది.