మంగళవారం, 17 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2023 (10:50 IST)

వాలంటీర్ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

murder
ఏపీలో వివాహేతర సంబంధం ఓ వాలంటీర్ ప్రాణం తీసింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వార్డు వలంటీరును ఆమె భర్త హత్య చేశాడు. ఈ సంఘటన ఆదివారం కడప జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కడప నగరం నిరంజన్ నగర్‌కు చెందిన చిట్వేలి భవానీశంకర్ (30), అతడి భార్య బాబాబీలు నిరంజన్ నగర్ 13, 14 వార్డుల వలంటీర్లుగా పనిచేస్తున్నారు. 
 
అలాగే, కడపకు చెందిన గుజ్జుల మల్లికార్జున జీవిత బీమా కార్యాలయంలోని ఈడీఎంఎస్‌లో డేటా డిజిటలైజేషన్ టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నారు. ఇదే బృందంలోని మల్లికార్జున భార్య శైలజతోపాటు, ఔట్ సోర్సింగ్ పద్ధతిన వలంటీర్ భవానీ శంకర్ కూడా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శైలజ, భవానీశంకర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న మల్లికార్జున శనివారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. భవానీశంకర్‌ను హత్య చేసి పగ తీర్చుకోవాలని పథకం రచించాడు. 
 
తన స్నేహితుడైన రంజిత్ కుమార్ అనే ఆటోడ్రైవర్‌తో కలసి ఆదివారం ఉదయం 9 గంటలకు భవానీశంకర్‌కు ఫోన్ చేసి ఎల్బీసీ కార్యాలయంలోని వీరి ఆఫీసుకు పిలిపించుకున్నారు. భవానీ శంకర్ వచ్చీరాగానే అతడి మెడపై కత్తితో నరికి అక్కడి నుంచి పారిపోయారు. 
 
తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిన భవానీ శంకర్ అక్కడికక్కడే కన్నుమూశాడు. కడప డీఎస్పీ ఎండీ షరీఫ్, వన్ టౌన్ సీఐ నాగరాజు, ఎస్ఐ రంగస్వామి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితులను ఆదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.