ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (10:30 IST)

ఖమ్మంలో మెడికో విద్యార్థిని ఆత్మహత్య .. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది..

manasa medico
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 22 యేళ్ల సముద్రాల మానస అనే విద్యార్థిని స్థానికంగా ఉండే మమత బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతుంది. ఆమె తాను ఉండే హస్టల్ గదిలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబ కలహాలే ఆమెను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మానస ఉండే హాస్టల్ గది నుంచి కాలుతున్న వాసన వస్తుండటంతో సహచర విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులు వచ్చి చూడగా, ఆమె గదిలో పొగలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు గది తలుపులు పగులగొట్టి లోపలకి వెళ్లారు. అప్పటికే మంటల్లో కాలిపోతున్న మానసపై నీళ్లుపోసి కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మానస మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 
 
ఓ పెట్రోల్ బంకు నుంచి మానస పెట్రోల్ కొనుగోలు చేసి వెళుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మానస తండ్రి ఇటీవలే చనిపోయారు. ఆ బాధ నుంచి ఆమె కోలుకోలేకపోయింది. తరచూ తండ్రిని తలచుకుని బాధపడుతూ ఉండేది. తండ్రిలేని బాధను తట్టుకోలేక మానస ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.