శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

మంచంతోనే యువతిని సజీవదహనం చేశారు.. ఎక్కడ?

murder
వెస్ట్ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మంచంపై నిద్రిపోతున్న ఓ యువతిని మంచంతో సహా బుడిద చేశారు. ఈ యువతిని కేవలం ఆస్తికోసమే హత్య చేశారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ముద్దాపురానికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్‌కు తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెంకు చెందిన గుజ్జరపు వసంత దంపతులకు హారిక (19) అనే ఏకైక కుమార్తె ఉంది. వసంత గత 2003లోనే అనుమానాస్పదంగా చనిపోయింది. ఆ తర్వాత 2009లో వైకాపా మహిళా మండలాధ్యక్షురాలు ముళ్లపూడి రూపను శ్రీనివాస్ రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఓ కుమార్తె కూడా ఉంది. అప్పటి నుంచి హారిక సవతి తల్లి వద్ద పెరుగుతూ వచ్చింది. 
 
ప్రస్తుతం తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలోని హాస్టల్‌లో ఉంటూ బీటెక్ రెండో సంవత్సరం చదువుతుంది. ఈ మధ్యనే హాస్టల్ నుంచి ఇంటికి ఇచ్చి కాలేజీకి వెళ్లి వస్తుంది. అయితే, శ్రీనివాస రావుకు రెండు ఇళ్లు ఉన్నాయి. 
 
ఒక ఇంటి వద్ద రెండో భార్య, ఆమె కుమార్తె ఉండగా, రెండో ఇంటివద్ద తన కుమార్తెతో కలిసి శ్రీనివాస రావు ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి శ్రీనివాస్ పనిమీద బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికా ఆలస్యమైంది. 
 
దీంతో రాత్రి సవతి తల్లి ఇంటికి వెళ్లి నిద్రపోయింది. ఆ రాత్రికి ఏం జరిగిందో తెలియదుగానీ.. తెల్లవారిసరికే హారిక పనుకున్న మంచంతోపాటు బూడిదై కనిపించింది. దీన్ని గమనించిన రూప తన భర్తకు సమాచారం అందించింది. ఆయన తణుకు పోలీసులకు సమాచారం చేరవేయడంతో పోలీసులు అక్కడకు వచ్చి వివరాలు సేకరించి అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.