బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (10:51 IST)

బాబుకి మరో దెబ్బ... ప్రజావేదిక నిర్మాణ వ్యయం రాబట్టేందుకు జగన్ సర్కార్ రెడీ?

ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై నిర్మించిన ప్రజా వేదిక కూల్చివేత దాదాపు పూర్తి కావొచ్చింది. సుమారు 8 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి నిర్మించిన ఈ భవన సముదాయాన్ని నేలమట్టం చేసింది జగన్ ప్రభుత్వం. మొన్న కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన దరిమిలా భవనం కూల్చివేతకు దిగారు అధికారులు.
 
ఇదిలా సాగుతుండగానే ప్రజాధనంతో నిర్మించిన భవనాన్ని కూలగొట్టారు సరే... దానికైన ఖర్చును ఎవరి దగ్గర్నుంచి రాబట్టాలి.. ఇదే విషయంపై సామాజిక వేత్త పోలూరి శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రజా వేదిక భవనం అక్రమ నిర్మాణమేననీ, ఆ భవనాన్ని కూల్చివేత తక్షణం ఆపేయాలంటూ విజ్ఞప్తి చేశారు. దాన్ని కూల్చివేసే ముందు ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారి నుంచి సొమ్మును రాబట్టాలని కోరారు.

గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆ సొమ్మును ఎవరి దగ్గర్నుంచి రాబట్టాలో ఆయనే పేర్కొన్నారు. అప్పటి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణల నుంచి డబ్బును రాబట్టాలంటూ పేర్కొన్నారు.
 
కాగా ప్రజావేదిక భవనం కూల్చివేత పనులు నిలిపివేయాలని పిటీషనర్ చేసిన అభ్యర్థనను నిరాకరించింది హైకోర్టు. ఐతే భవనాన్ని నిర్మించినందుకైన ఖర్చును రాబట్టాలన్న అంశంపైన విచారణ చేస్తామని తెలియజేసింది. కేసును రెండు వారాల పాటు వాయిదా వేసింది. ఐతే ప్రజావేదిక నిర్మాణ వ్యయం రికవరీపై ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరాం కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
 
పర్యావరణానికి సమస్యలు తలెత్తేలా ఏమయినా నిర్మాణాలు చేపట్టి వుంటే దాన్ని తొలగించే బాధ్యత కోర్టులకు ఉందన్నారు. అలాగే ప్రజా ధనం దుర్వినియోగం ఎవరు చేశారో.. వారి వద్ద నుంచి పైకం వసూలు చేయాల్సిందేనంటూ చెప్పారు. దీన్నిబట్టి చూస్తుంటే... ప్రజావేదికకు ఖర్చయిన మొత్తాన్ని మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణల నుంచి వసూలు చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమైనట్లేనని అనుకుంటున్నారు. ఐతే కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో మరో రెండు వారాలు వేచి చూడాల్సిందే.