శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 7 జనవరి 2020 (19:44 IST)

సీబీఐ మాజీ జెడీ లక్ష్మీ నారాయణ జెండా మారుస్తున్నారా? పవన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా?

సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ జెండా మారుస్తున్నారా? జనసేన పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారా? అంటే  అవుననే సమాధానం రాబోతుంది. భారతీయ జనతాపార్టీ అగ్ర నేతలతో లక్ష్మీనారాయణ టచ్‌లో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. స్వచ్చంద పదవీ విరమణ తీసుకుని జనసేన పార్టీ నుంచి విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేడీ ఓటమి పాలైన సంగతి తెల్సిందే. అయితే పార్టీ కార్యక్రమాలలో పెద్దగా వేదికల మీద కనిపించకపోయినా పవన్ కళ్యాణ్‌కు లక్ష్మీ నారాయణ టచ్‌లో ఉంటారనేది జనసేన పార్టీ నేతల సమాచారం. 
 
ఎన్నికల ఫలితాలు జనసేన పార్టీని, వ్యక్తిగతంగా లక్ష్మీనారయణను నిరాశపరిచినా, పలు సేవా కార్యక్రమాలు పేరుతో జేడీ విశాఖ వాసులకు అందుబాటులోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనకు రాజకీయ భవిష్యత్ ఏమేరకు ఉంటుందన్న ఉద్దేశ్యంతో పార్టీ మారాలా? వద్దా ? అని యోచిస్తున్న సమయంలో బీజేపీ పార్టీ అగ్రనేతల నుంచి ఆహ్వానం రావడంతో లక్ష్మీనారాయణ కాస్త సానుకులంగా ఉన్నట్టు సమాచారం. 
 
ఒకవేళ లక్ష్మీనారయణ పార్టీ వీడితే జనసేన పార్టీకి పెద్ద షాక్ తగలినట్టే. అర్బన్ ఓటర్లును ప్రభావితం చేయగల వాక్చాతుర్యంతో పాటు మిస్టర్ క్లీన్‌గా పేరు ఉండటంతో బీజేపీ ఢిల్లీ నేతల చూపు లక్ష్మీనారాయణ మీదకు మళ్లింది. 2024 టార్గెట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తోంది.
 
మరోవైపు సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు అయిన మంచు మోహన్ బాబు కుటుంబ సమేతంగా సోమవారం ప్రధాని మోదీని కలవడం రాజకీయ వర్గాల్లో, సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో దగ్గరి బంధుత్వం ఉన్న మోహన్ బాబు, బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు ప్రస్తుతానికి వాయిదా పడినా భవిష్యత్‌లో జరిగే పరిణామాలు మాత్రం అంచనా వేయడం అంత పెద్ద కష్టం కాదంటున్నాయి పొలిటికల్ వర్గాలు. చూడాలి ఏం జరుగుతుందో?