1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2023 (19:47 IST)

ఏపీ ఎన్నికలు 2024.. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు..?

pawan kalyan
ఏపీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీలో సీఎం జగన్ సామాజిక గణాంకాల ఆధారంగా అభ్యర్థులను మారుస్తున్నారు. అయితే టీడీపీ, జనసేన పొత్తుతో ఎలాగైనా జగన్‌ను ఓడించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. 
 
ప్రస్తుతానికి వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మార్పు జరుగుతుండగా, టీడీపీ, జనసేనలు తమ అభ్యర్థుల ఖరారు ప్రక్రియను వేగవంతం చేశాయి. జనసేన అభ్యర్థులను పవన్ కళ్యాణ్ దాదాపు ఖరారు చేశారు. జాబితాలో సీనియర్లకే ప్రాధాన్యం ఇచ్చారు.
 
అభ్యర్థుల ఎంపిక: ఏపీలో ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఖరారుపై తుది కసరత్తు జరుగుతోంది. 2014 తర్వాత చంద్రబాబు, పవన్ ఒకే వేదికపైకి వస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 27 అసెంబ్లీ, 2 లోక్‌సభ సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. 
 
దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది. అనకాపల్లి, మచిలీపట్నం లోక్‌సభ స్థానాలను జనసేనకు కేటాయించడం దాదాపు ఖాయమైంది. రాజంపేట సీటుపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సీట్లపై ఒప్పందం కుదిరింది.
 
జనసేనకు కేటాయించే సీట్లలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన అభ్యర్థులను ఖరారు చేశారు. వైసీపీ చేస్తున్న మార్పులు-చేర్పుల తర్వాత అవసరమైతే మార్పులు చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. 
 
భీమవరంతో పాటు తిరుపతిలో పవన్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. ఇప్పటివరకు ఖరారు చేసిన జాబితాలో సీనియర్లకే ప్రాధాన్యం ఇచ్చారు. నెల్లిమర్ల- లోకం నాగ మాధవి, గజపతిపురం- పడాల అరుణ, గాజువాక- సుందరపు సతీష్, భీమిలి- పంచకర్ల సందీప్ లేదా పెందుర్తి- పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచిలి- సుందరపు విజయ్ కుమార్, ముమ్మిడివరం- పీతాని బాలకృష్ణ పేర్లు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం.