గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: సోమవారం, 23 జులై 2018 (15:48 IST)

కార్గిల్ అమరవీరులకు సెల్యూట్... జూలై 26 కార్గిల్ దివస్

జూలై 26వ తేదీకి ఓ విశిష్టమైన చరిత్ర వుంది. ఆ రోజున కార్గిల్ విజయం భారత్‌ని వరించింది. దాదాపు నెల రోజుల పాటు ప్రపంచంలోని అతి ఎత్తైన ప్రాంతంలో చిరకాల శత్రువులైన భారత్ పాకిస్థాన్‌లు బాహాబాహీగా తలపడ్డాయి. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు పాకిస్థాన్ వేసి

జూలై 26వ తేదీకి ఓ విశిష్టమైన చరిత్ర వుంది. ఆ రోజున కార్గిల్ విజయం భారత్‌ని వరించింది. దాదాపు నెల రోజుల పాటు ప్రపంచంలోని అతి ఎత్తైన ప్రాంతంలో చిరకాల శత్రువులైన భారత్ పాకిస్థాన్‌లు బాహాబాహీగా తలపడ్డాయి. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు పాకిస్థాన్ వేసిన పాచికలు పారకుండా, వెనక్కి తరిమేసింది భారత సైన్యం. ఆ రోజునే కార్గిల్ యుద్ధం విజయోత్సవ దినోత్సవంగా గత పుష్కర కాలంగా జరుపుకుంటూ వస్తున్నారు. 
 
సాధారణంగా చలికాలంలో సరిహద్దు సైనిక పోస్టులను ఇరు దేశాల సైనికులూ వదిలేసి వెచ్చని ప్రాంతాలకు వస్తారు. కానీ 1999 శీతాకాలంలో పాకిస్థానీ సైనికులు తమ పోస్టులను వదలలేదు. భారత్ పోస్టులను కూడా ఆక్రమించుకున్నారు. మిలిటెంట్ల రూపంలో పాకిస్థానీలు చొరబడ్డారు. ఈ విషయం మే నెలలో భారత్ దృష్టికి వచ్చింది. దీంతో కార్గిల్ జిల్లాలోని సరిహద్దుల్లో ఉన్న ఎత్తైన మంచు పర్వతాలను తిరిగి చేజిక్కించుకునేందుకు భారత సైన్యం యుద్ధం చేయాల్సి వచ్చింది. 
 
కార్గిల్ లడఖ్ ప్రాంతాన్ని కలిపే భాగం. దీన్ని చేజిక్కించుకుంటే లడఖ్ ప్రాంతం భారత్ చేజారుతుంది. సియాచిన్ గ్లేసియర్‌కి వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోతాయి. అప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి సియాచిన్‌లో పాక్ జెండా ఎగురుతుంది. అందుకే పాకిస్థాన్ ఈ ఘాతుకానికి పాల్పడింది.
 
ఈ యుద్ధంలో 537 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. 1363 మంది గాయపడ్డారు. రెండు విమానాలు, ఒక హెలీకాప్టర్‌లను నష్టపోవాల్సి వచ్చింది. ఒక జవాను శత్రువు చేతిలో ఖైదీగా చిక్కాడు. పాకిస్థాన్‌కి చెందిన 453 మంది చనిపోయారు. 665 మంది గాయపడ్డారు. ఎనిమిది మంది బందీలుగా చిక్కారు. కొండ పైకి ఎగబాకి యుద్ధం చేయాల్సి రావడంతో మనకు ఎక్కువ నష్టం సంభవించింది. ఫలితంగా ఎంతో మంది సైనిక వీరులను కోల్పోవాల్సి వచ్చింది.    
 
అయితే, ఈ యుద్ధం వల్ల భారత్‌కు ఎక్కువ నష్టమే జరిగినప్పటికీ.. శత్రుదేశమైన పాకిస్థాన్‍ని అంతర్జాతీయంగా దౌత్యపరంగా కోలుకోలేని దెబ్బతీశాం. ఈ యుద్ధం తర్వాత పాకిస్థాన్‌లో ప్రభుత్వమే మారిపోయింది. ముఖ్యంగా పాకిస్థాన్‌ను ఒక ఉగ్రవాద దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టడంలో భారత్ విజయం సాధించింది.