బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (21:15 IST)

కర్నాటకలో 353 కరోనా పాజిటివ్ కేసులు, ఐనా నో ఫియర్, దేవెగౌడ మనవడి పెళ్లి

కర్ణాటలో కరోనా ఆంక్షలు బేఖాతరయ్యాయి. కేంద్రం ఎట్టిపరిస్ధితిలోనూ శుభకార్యాలకు అనుమతి లేదంటూ చెప్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడి వివాహా వేడుకలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ అన్ని వివాహ శుభకార్యాలు రద్దయ్యాయి. అయినా సరే కుమారస్వామి ఆర్బాటంగా వివాహాన్ని బంధుమిత్రుల సమక్షంలో జరగడం పలు విమర్శలకు తావిస్తోంది.
 
అయితే దీనిపై ప్రభుత్వ స్పందనపై అందరీ దృష్టి పడింది. కరోనాకు కట్టడికి కఠిన నిర్ణయాలు అమలవుతున్నా సరే అదుపులోకి రావడం లేదు. జనసాంధ్రత కలిగిన ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చెయ్యడం, లాక్ డౌన్‌కు ప్రభుత్వం ఆదేశించడం కాస్తా ఉపశమనం ఇస్తున్నా భవిష్యత్‌లో కరోనా వైరస్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందని దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కర్ణాటకలో మాత్రం ఈ వైరస్ అధికంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకూ కర్ణాటకలో 353 పాజిటివ్ కేసులు నమోదు కాగా 13 మంది మృతి చెందారు. ఈ క్రమంలో 13 హాట్ స్పాట్స్ కూడా అధికారులు గుర్తించారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఆదర్శంగా నిలవాల్సిన రాజకీయ నేతలు ఇష్టారీతిన వ్యవహరించడంపై కన్నడ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
 
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న క్లిష్ట సమయంలో దేశ మాజీ ప్రధాని మనవడి వివాహం జరగడం చర్చనీయాంశమైంది. మాజీ ప్రధానమంత్రి  దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌ వివాహం జరిగింది. దీనికి బెంగళూరు సమీపంలోని రామనగరలో ఉన్న వారి ఫాంహౌజ్‌ వేదికైంది. ఈ వివాహానికి బయటివారు ఎవ్వరూ హాజరుకానప్పటికీ ఇరు కుటుంబసభ్యుల నడుమ ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. 
అయితే ఈ వివాహానికి హాజరైన వారు మాత్రం లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించలేదు. దీనిపై గతంలో కుమారస్వామి పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరుగుతుందని చెప్పినా భారీగానే బంధువులు హాజరైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వివాహానికి వచ్చిన ఏ ఒక్కరు కూడా మాస్కులు ధరించకపోగా సామాజిక దూరం కూడా పాటించలేదని ఫోటోలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది.
 
పెళ్ళికుమార్తె కూడా ప్రముఖ కాంగ్రెస్‌ నేత దగ్గరి బంధువు కావడంతో రాజకీయపరంగా ఈ వివాహానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ కార్యక్రమానికి కార్యకర్తలు దూరంగా ఉండాలని వివాహానికి ముందురోజు జేడీఎస్‌ నేత కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. కేవలం తమ కుటుంబాలకు చెందిన 60 నుంచి 70 మంది మాత్రమే హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తామని తెలిపారు.
కానీ ఈ వివాహ వేడుకల్లో అవేవీ పాటించకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది. 
అయితే వివాహ కార్యక్రమంపై కర్ణాటక ప్రభుత్వం ముందుగానే స్పందించింది. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకపోతే మాత్రం కుమారస్వామిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కేవలం వందమంది అతిథుల సమక్షంలో ఓ ఫామ్ హౌస్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. అయితే ఈ వివాహ వేడుకపై కర్ణాటక ప్రభుత్వం నివేదిక కోరింది. ఈ పెళ్లి వేడుకలో సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వినిపించాయి. 
 
సోషల్ మీడియాలోనూ దీనిపై విమర్శలు వచ్చాయి. దీంతో యడియూరప్ప ప్రభుత్వం రామ్‌నగర్ అధికారుల నుంచి ఈ వివాహ వేడుకపై నివేదిక కోరింది. కరోనా వేళ లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో వివాహం జరపడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
జనతాదళ్ నుంచి గత ఎన్నికల్లో మాండ్య ఎంపి స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఎన్నికలలో ఓడిపోయిన నిఖిల్, కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి ఎం.కృష్ణప్ప మనుమరాలు రేవతిని వివాహాం చేసుకున్నారు. కుమారస్వామి భార్య అనిత కుమారస్వామి రామనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడే వివాహ ఏర్పాట్లు కొసం భారీగా జరిగాయి.
 
మొదట్లో దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు రావడంతో అప్పుడే ఈ రచ్చమొదలైంది. దీనిపై స్సందించిన కుమారస్వామి, నిబంధనలకు అనుగుణంగా తక్కువ సంఖ్యలో బంధువులు హాజరవుతున్నారని చెప్పారు. కానీ వివాహా వేడుకలు బట్టి భారీగానే బంధువులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కుమారస్వామి తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ, వివాహం వేడుకుల నేపధ్యంలో నిబంధనలకు అనుగుణంగా జరుగుతాయని, సామాజిక దూరాన్ని పాటిస్తామని చెప్పారు. 
 
కానీ వివాహం జరిగే ప్రాంతాల్లో బారికేడ్లు లాంటివి ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. వివాహ వేడుకలు మాత్రం జబర్దస్త్ గానే జరిగాయని వీడియోల ద్వారా తెలుస్తోంది.
 కుమారస్వామి చెప్పింది ఒకటి జరిగింది ఒకటి. అన్నీ సవ్యంగా జరిగాయని చెప్పుకొచ్చారు. కానీ వివాహ వేడుకల నేపద్యంలో వెలుగు చూసిప వాస్తవాలు భవిష్యత్‌లో కుమార స్వామి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాల్సిందే.