1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By chj
Last Modified: శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (16:11 IST)

శశికళ గురించి ప్రధాని మోదీకి తెలిసిన అసలు నిజం... ఏంటది?

తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో మోదీ ఏ వర్గానికి కొమ్ముకాయనున్నారనే ఆలోచన ప్రస్తుతం అందరిలోనూ నెలకొంది. ఐతే ఆది నుంచి శశికళ వైఖరి పట్ల ఏమాత్రం సదభిప్రాయం లేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమె సీఎం కావడం ఏమాత్రం ఇష్టం లేదని బీజేపీ వర్గాలు చెబుతున

తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో మోదీ ఏ వర్గానికి కొమ్ముకాయనున్నారనే ఆలోచన ప్రస్తుతం అందరిలోనూ నెలకొంది. ఐతే ఆది నుంచి శశికళ వైఖరి పట్ల ఏమాత్రం సదభిప్రాయం లేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమె సీఎం కావడం ఏమాత్రం ఇష్టం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరిని సీఎంగా ఎన్నుకోవాలన్నది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమైనప్పటికీ, గతంలో తనకు తెలిసిన కొన్ని సంఘటనల దృష్ట్యా ‘మన్నార్‌గుడి మాఫియా’ పట్ల ప్రధానికి ఎంతమాత్రం సదుద్దేశం లేదని మాత్రం తెలుస్తోంది. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శశికళ బృందం వైఖరి గురించి జయను హెచ్చరించడం వల్లనే 2011లో చిన్నమ్మను జయ పోయెస్ గార్డెన్‌ నుంచి వెళ్లగొట్టారనే ప్రచారం తెలిసిందే.
 
దీనిపై 2012లో ‘తెహల్కా’ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం  గుజరాత్‌కు చెందిన ఒక ఎన్నారై తమిళనాడులో పెద్ద పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నించారు. తమిళనాట పరిశ్రమ పెట్టాలంటే తమకు ప్రాజెక్టు వ్యయంలో 15 శాతం ముట్టజెప్పాలని మన్నార్‌గుడి మాఫియా డిమాండ్‌ చేసింది. దీంతో ఆయన గుజరాత్‌కు వెళ్లి అక్కడే పరిశ్రమ పెట్టుకొన్నారు. మాటల సందర్భంలో నాటి గుజరాత్ సీఎం మోదీకి ఈ విషయాన్ని చెప్పారు. దీంతో మోదీ నేరుగా జయలలితకు ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పారు. తన శ్రేయస్సును కోరి మోదీ చెప్పిన మాటలను జయ పెడ చెవిన పెట్టలేదు. అప్పటి నుండే జయ తన నిఘాను ‘మన్నార్‌గుడి మాఫియా’ పై కేంద్రీకరించారని తెలుస్తోంది.
 
చెన్నై మోనో రైలు ప్రాజెక్టు విషయంలోను, తనకిచ్చే మందుల విషయంలోను, తాను జైలుకు వెళితే ఆ తరువాత అధికారాన్ని చేజెక్కించుకునే విషయంలోను, తన గురించి క్షుద్ర పూజలు చేయించడం తదితర అంశాలలో శశికళ నేతృత్వంలో మన్నార్ గుడి సమూహం చేసిన వ్యూహాలు క్రమంగా ఒకదాని తరువాత మరొకటి జయకు తెలియడం మొదలు పెట్టాయి.
 
చివరకు డిసెంబరు 17, 2011న శశికళతో సహా మన్నార్‌ గుడి మాఫియాను పోయస్‌ గార్డెన్‌ వదిలి వెళ్లాలని అమ్మ ఆదేశించారు. 18న శశికళ, ఆమె భర్తసహా పలువురిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ వెంటనే మన్నార్‌ గుడి మాఫియాపై ఏసీబీ దాడులు ప్రారంభమయ్యాయి. పలువురి ఇళ్ల నుంచి కోట్లాది రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకొన్నారు. అయితే, జరిగిన ఉదంతంలో తన పాత్ర ఏమీ లేదని శశికళ.. జయలలితను వేడుకొన్నారు. 
 
సుమారు పక్షం రోజులపాటు ఆహారం ముట్టకుండా అమ్మ కరుణ కోసం తపించారు. ఎట్టకేలకు అమ్మ కరుణించింది. దూరం పెట్టి ముచ్చటగా మూడ నెలలు కాకుండానే తిరిగి శశికళను అక్కున చేర్చుకుంది. ఇదంతా తెలిసినందునే మోదీ శశికళ పట్ల విముఖంగా ఉన్నట్టు సమాచారం. ఆమెను జయలలిత నమ్మి ఉండొచ్చుగానీ, ప్రధానికి మాత్రం ఆమెపై నమ్మకం లేదనే విషయాన్ని ప్రధాని కార్యాలయ వర్గాలు అన్నాడీఎంకే ఎంపీలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.