గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (13:54 IST)

రతన్ టాటా మృతి : రూ.వేల కోట్ల టాటా సామ్రాజ్యానికి తదుపరి వారసుడు ఎవరు?

ratan tata
భారత పారిశ్రామికదిగ్గజం రతన్ టాటా ఇకలేరు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. దీంతో టాటా వ్యాపార సామ్రాజ్యానికి దిశానిర్దేశం చేసే రతన్ టాటా వారసుడు ఎవరంటూ అపుడే నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రతన్ టాటా మృతిపై ఈ అంశం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ రేసులో ముగ్గురు ఉన్నారు. వారిలో రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా కుమార్తె మయా టాటా (34), ఆమె సోదరుడు నెవిల్లే టాటా (32), వారి సోదరి లీ టాటా (39) పేర్లు వినిపిస్తున్నాయి. 
 
అయితే నోయెల్ టాటా కుమార్తె అయిన మయా టాటా తన కెరియర్‌ను టాటా అపర్చ్యూనిటీ ఫండ్‌తో ప్రారంభించి ఆ తర్వాత టాటా డిజిటల్లోకి మారారు. టాటా న్యూ యాప్‌ను అభివృద్ధి చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆమె తన తోబుట్టువులతో కలిసి టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో పని చేస్తున్నారు. ఆమె తల్లి టాటా గ్రూప్ దివంగత సైరన్ మిస్త్రీ సోదరి. 
 
మయా సోదరుడైన నెవిల్లే టాటా కూడా రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా కనిపిస్తున్నారు. కుటుంబ వ్యాపారంలో నిమగ్నమై వున్న ఆయన టయోటా కిర్లోస్కర్ గ్రూపు వారసురాలు మాన్సీ కిర్లోస్కర్‌ను వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడే జంషెడ్ టాటా. ట్రెంట్ లిమిటెడ్ కింద టాటా స్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్‌ చైన్‌ను ఆయన నిర్వహిస్తున్నారు. జుడియో, వెస్ట్‌సైడ్ బాద్యతలు కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. 
 
మయా టాటా సోదరి లీ టాటా తాజ్ హోటల్స్, ప్యాలెస్‌లలో చనిచేశారు. ప్రస్తుతం ఆమె టాటా గ్రూపులో భాగమైన ఇండియన్ హోటల్ కంపెనీ కార్యకలాపాలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె దృష్టంతా హోటల్ పరిశ్రమపైనేవుంది. ఈ ముగ్గురిలో ఒకరు రతన్ టాటా వారసుడు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.