1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2016 (10:52 IST)

ఉప్పు అధికంగా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

ఆహార పదార్థాలలో ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల... హైపర్‌ టెన్షన్ వంటి అనారోగ్య సమస్యలే కాకుండా, గుండెపోటులాంటి తీవ్రమైన జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు వినియోగం పెరిగినందువల్లే, ఇటీవల అధిక రక్తపోటు కేసులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ప్రపంచంలో హైపర్ టెన్షన్‌తో జీవిస్తోన్న బిలియన్‌ మంది ప్రజల్లో 30 శాతం మంది ఉప్పు అతిగా వాడటం వల్లే బ్లడ్ ప్రెషర్ (బీపీ) పెంచేసుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే, దక్షిణ అమెరికాలోని యానోమమి జాతీయులు ఆహారంలో అస్సలు ఉప్పు వాడరు. అందుకే వారు హైపర్ టెన్షన్ వంటి సమస్యలకు చాలా దూరంగా ఉంటారని పరిశోధకులు వెల్లడించారు. ఇక జపాన్‌లో అయితే, తలసరి ఉప్పు వినియోగం 15 గ్రాములు ఉంది కాబట్టి, వీరు హైపర్ టెన్షన్ గుండె జబ్బుల పాలబడుతుంటారని పరిశోధకులు పేర్కొన్నారు.
 
ఇక భారతీయ వంటకాల విషయానికి వస్తే... సంప్రదాయ వంటకాల్లోనైనా, ఆధునిక వంటకాల్లోనైనా ఉప్పును తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కాబట్టే, ఉప్పువాడకం వల్ల వచ్చే ముప్పులు ఇతర దేశాల్లోకంటే భారతదేశంలోనే నిపుణులు అంటున్నారు. 
 
ఇదిలావుంటే వాస్తవానికి రుచి కోసం తప్పితే, వంటకాల్లో అసలు ఉప్పు వాడాల్సిన అవసరమే లేదనీ, మరీ అంత చప్పగా తినలేనివాళ్లలో పెద్దవారు రోజుకు 2.8 గ్రాములు, వృద్ధులు 2.2 గ్రాములు మాత్రం తీసుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఆహార పదార్థాలలో ఉప్పు వాడకాన్ని తగ్గించటం వల్ల పైన పేర్కన్న హైపర్ టెన్షన్, హార్ట్ ఎటాక్, బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. పూర్తిగా ఉప్పు లేని పదార్థాలను తినలేనివారు, పైపరిశోధకులు చెప్పినట్లుగా అతి తక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే... ఆరోగ్యాలను కాపాడుకున్నవారవుతారు.