శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Modified: గురువారం, 25 ఏప్రియల్ 2019 (19:09 IST)

మలేరియా జ్వరం ఎలా వస్తుంది? చికిత్స ఏమిటి?

ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25. ఈ నేపధ్యంలో మలేరియా వ్యాధిని తరిమికొట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. సాధారణంగా జ్వరం కొద్దిగా ఉండి ఒక్కసారిగా చలితో జ్వరంతో ప్రారంభమవుతుంది మలేరియా.

ప్రారంభంలో శరీరం చల్లగానే ఉండి అకస్మాత్తుగా పొగలుగ్రక్కే వేడి వచ్చేస్తుంది. చల్లని దశలో వణుకు మొదలవుతాయి. చలి వణుకు ఉన్నప్పుడు జ్వరం 104 డిగ్రీల ఫారన్‌హీట్ నుండి 105 డిగ్రీల ఫారన్ హీట్‌కు పెరుగుతుంది. ఇది ఒకవేళ 106 డిగ్రీల ఫారన్‌హీట్ పెరిగితే రోగి గందరగోళంగా మారుతాడు. 
 
ఈ స్థితిలో విపరీతమైన జ్వరం, వణుకు, చలి, తలనొప్పి, శరీర నొప్పులు, వాంతులు ఉండి 4-5 గంటల తర్వాత జ్వరం, వణుకు తగ్గి చమటతో శరీరం తడిసిపోతుంది. జ్వరం, చలి, తలనొప్పి రోజు విడిచి రోజు కాని, రెండు రోజులకు కాని రావొచ్చు. నోరు చేదుగా ఉండి, ఆహారం తినడానికి ఇష్టపడరు. రోగిని పరీక్ష చేసినప్పుడు ప్లీహం వాపు ఉంటుంది. రక్తపరీక్ష ద్వారా మలేరియా తెలుస్తుంది. 
 
చికిత్స: రోగికి విశ్రాంతి ఇవ్వాలి. రోగికి కాచి చల్లార్చిన నీరు బాగా తాగడానికి ఇవ్వాలి. వైద్యుని సంప్రదించాలి.
 
ఆయుర్వేదం ప్రకారం మలేరియా జ్వరం తగ్గేందుకు ఉపయోగించు ద్రవ్యాలు:
1. ఉసిరి, కరక్కాయ, తానికాయ, తిప్పతీగె, వాసా కషాయం కాచుకుని 20-30 మి.లీ. సేవించిన విష జ్వరం తగ్గుతుంది. సుదర్శన ఘనవటి 500 మి.గ్రా. బిళ్ళలు పూటకు రెండు చొప్పున వాడాలి. 
 
2. శొంఠి, కిరాతతిక్త, త్రిఫలా, గుడూచి, ఆమలకీ, ముస్తా, తులసి మొదలగువానిని సమభాగాలుగా తీసుకుని కషాయం కాచి సేవించిన మలేరియాలో ఉపయుక్తంగా ఉండును. 
 
3. గూడూచి కషాయం 3 మి.లీ. సాయంత్రం సేవించిన విష జ్వరంలో ఉపయుక్తంగా ఉంటుంది. రక్తచందన, గూడూచి, శొంఠి సమాన భాగాలు గ్రహించిన కషాయం కాచి 20-30 మి.లీ. రోజుకు 3 సార్లు సేవించిన విష జ్వరం హరిస్తుంది. 
 
4. పాలు, రొట్టె, పండ్లరసాలు, మెత్తగా, గుజ్జులా చేసిన ఆహారపు ఊట, కిచిడి మొదలగునవి ఇవ్వవచ్చును. తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి.