మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 జులై 2021 (18:40 IST)

భాగ్యనగరాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు

తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంది. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వర్షాలతో పాటు.. సీజనల్ వ్యాధుల తీవ్రత కూడా పెరిగింది. ఈ  సీజనల్ వ్యాధులు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. 
 
డెంగీ, డిఫ్తీరియా తదితర వ్యాధులు నగరంలో వేగంగా విస్తరిస్తూ.. ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. గత 15 రోజుల్లో డిఫ్తీరియాతో ఏడుగురు, డెంగీతో నలుగురు మృత్యువాతపడ్డారు. శుక్రవారం ఒక్కరోజే సికింద్రాబాద్‌లోని వివిధ ఆస్పత్రుల్లో ఐదు, ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో నాలుగు, ఫీవర్ ఆస్పత్రిలో ఒక డెంగీ, మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవటంతో బస్తీవాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 
 
స్వైన్‌ఫ్లూతో గుల్బార్గాకు చెందిన ఓ మహిళ(33) యశోద ఆస్పత్రిలో, బోరబండకు చెందిన బాలిక(4) లోటస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యశోదలో చికిత్స పొందుతున్న మహిళ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలిసింది.
 
ముఖ్యంగా, కలరా, డెంగీ, డిఫ్తీరియా, స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులు నగరంలో విస్తరిస్తూ.. ప్రజల ప్రాణాలను హరిస్తున్నా అధికారుల్లో చలనం రావడం లేదు. పైగా సీజనల్ వ్యాధుల కారణంగా నమోదైన మరణాలను గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.