1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జులై 2022 (09:34 IST)

పాకిస్థాన్‌లో లోయలో పడిన బస్సు - 19 మంది మృత్యువాత

road accident
పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 30 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది వరకు చనిపోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన బలూచిస్థాన్‌లోని క్వెట్టా సమీపంలో సంభవించింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
 
'బస్సు క్వెట్టా సమీపానికి రాగానే ఓ మలుపు వద్ద నియంత్రణ కోల్పోయి లోయలోకి దూసుకెళ్లింది. ఇప్పటివరకు 19 మృతదేహాలను వెలికితీశాం. గాయపడ్డ మరో 11 మందిని ఆస్పత్రిలో చేర్పించాం' అని అసిస్టెంట్‌ కమిషనర్‌ సయ్యద్‌ మెహ్తబ్‌ షా వెల్లడించారు. 
 
అయితే, ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర అతివేగం, భారీ వర్షమే ప్రధాన కారణమై వుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. బస్సు ప్రమాద ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ ఖుదూస్ బిజెంజో విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.