1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: మంగళవారం, 19 మార్చి 2019 (19:08 IST)

తిమింగలం పొట్టలో 40 కిలోల ప్లాస్టిక్... ఏం జరిగింది?

ప్లాస్టిక్‌ను సముద్రాల్లో పారవేయద్దని ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేస్తున్నారు. అయినప్పటికీ చాలా దేశాలు వాటిని పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ప్లాస్టిక్‌ను ఎక్కువగా సముద్రంలో పారవేస్తున్న దేశంగా ఫిలిప్పీన్స్ ఉంది. ప్లాస్టిక్‌ను సముద్రంలో పారవేయడం వల్ల సముద్ర జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా ఫిలిప్పీన్స్‌లో ప్లాస్టిక్ మింగడం వల్ల ఒక తిమింగలం మరణించింది.
 
మబీని నగరంలో ఒడ్డున పడి ఉన్న తిమింగలాన్ని అక్కడి జాలర్లు తిరిగి సముద్రంలోకి పంపించారు. సముద్రంలోకి పంపిన తిమింగలానికి ఈదే శక్తి కూడా లేక మరణించింది. ఆ తర్వాత దానికి పరీక్షలు జరపగా అది ఆకలి వల్ల మరణించినట్లు తేలింది. అయితే తిమింగలానికి ఆహారం దొరక్క మరణించలేదు. 
 
తిన్న ఆహారం కడుపులోకి వెళ్లకుండా నలభై కిలోల ప్లాస్టిక్ అడ్డుగా ఉండిపోవడంతో ఆ జీవి దేన్నీ తినలేక చాలా రోజులపాటు పస్తులుండి ఆకలితో మరణించిందని డాక్టర్లు చెప్పారు. ఈ సంఘటనతో అక్కడ అందరూ చలించిపోయారు. ఇంత దయనీయ స్థితిలో తిమింగలం మరణించడం చాలా దారుణమని అన్నారు. గత సంవత్సరం కూడా థాయ్‌లాండ్‌లో ప్లాస్టిక్ మింగి ఒక తిమింగలం మరణించగా ఇది రెండవది. దీనిపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.