1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (13:25 IST)

టిఫిన్ కోసం లైన్‌లో నిలబడి.. జనాల మధ్యలోకి వచ్చి బాంబు పేల్చాడు..

శ్రీలంకలోని సినామాన్ హోటల్‌లో ఓ ఉగ్రవాది ఓపికగా క్యూలో నిల్చున్న వైనం సీసీ కెమెరాకు చిక్కింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బ్యాగు తగిలించుకుని వచ్చిన ఓ వ్యక్తి హోటల్‌లో టిఫిక్ కోసం చేతిలో ప్లేటు పట్టుకుని క్యూలో నిల్చున్నాడు. 
 
అలా నిల్చున్న ఆ ఉగ్రవాది.. జనాలను చూస్తూ.. జనాల మధ్యలోకి వచ్చాక ఒక్కసారిగా తన బ్యాగులో ఉన్న బాంబును పేల్చాడు. అంతే ఏం జరిగిందని తెలుసుకునేలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మాంసం ముద్దలు గాల్లోకి ఎగిరిపడ్డాయి. ఇదంతా లంకలోని సినామాన్ హోటల్ వద్ద చోటుచేసుకున్న దారుణం. 
 
ఆదివారం ఉదయం పూట ఈ ఘటన చోటుచేసుకుంది. మహమ్మద్ అజాం మహమ్మద్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. జనాలు పెద్ద సంఖ్యలో క్యూలో ఉండడంతో అదే సరైన సమయమని భావించిన అజాం బాంబు పేల్చాడు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 
 
తాను ఆ దేశవాసినేనని అజాం చెప్పి హోటల్‌లోకి వచ్చినట్టు మేనేజర్ తెలిపాడు. తాను పెద్ద వ్యాపారినని పరిచయం చేసుకుని హోటల్ గదులు బుక్ చేసుకున్నాడని పేర్కొన్నాడు. వ్యాపారం నిమిత్తం కొలంబో వచ్చానని చెప్పిన అజాం గదుల బుకింగ్ కోసం ఇచ్చిన అడ్రస్ నకిలీదని పోలీసుల విచారణలో తేలింది.
 
ఇదిలా ఉంటే.. ఈస్టర్ రోజున శ్రీలంకలో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. రాజధాని కొలంబో సహా... ఎనిమిది చోట్ల (ఇందులో మూడు చర్చిలు, మూడు హోటళ్లు వున్నాయి) వరుస బాంబు పేలుళ్లు జరిపారు. ముఖ్యంగా కొలంబోలోని రెండు ప్రధాన చర్చిలలో జరిగిన శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లలో 290 మంది చనిపోగా... 500 మందికి పైగా గాయాలపాలైనట్లు తెలుస్తోంది.