బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మే 2022 (17:12 IST)

వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయిల్ దాడులు.. మహిళా రిపోర్టర్ మృతి

female reporter
female reporter
పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. జెనిన్‌లోని ఆక్రమిత వెస్ట్ బ్యాంకు పట్టణంలో ఇజ్రాయిల్ చేపట్టిన దాడుల్లో విధులు నిర్వర్తిస్తున్న అల్ జజీరాకు చెందిన షిరీన్ అబు అక్లే అనే మహిళా రిపోర్టర్ ప్రాణాలు కోల్పోయారు. షిరీన్‌ను అతి దారుణంగా హత్య చేశారంటూ అల్‌ జజీరా ఆరోపిస్తోంది. 
 
ఘటన జరిగిన సమయంలో షిరీన్ బుల్లెట్ జాకెట్ ధరించి ఉన్నారు. దానిపై ప్రెస్ అని కూడా రాసి ఉంది. షిరీన్ మృతిని అల్ జజీరా తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయిల్ దళాలు కావాలనే షిరీన్ పై కాల్పులు జరిపాయని ఆరోపిస్తోంది. 
 
పాలస్తీనాకు చెందిన 51 ఏళ్ల షిరీన్ అల్ జజీరాలో 1997 నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. గత కొన్ని రోజులుగా జెనిన్ ప్రాంతంలో ఇజ్రాయిల్ దాడులను రిపోర్టింగ్ ద్వారా కవర్ చేస్తున్నారు. 
 
ఎప్పటిలాగానే బుధవారం విధులు నిర్వర్తిస్తుండగా.. అక్కడ జరిగిన కాల్పుల్లో షిరీన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. అలాగే మరో పాలస్తీనా జర్నలిస్టు కూడా ఈ కాల్పుల్లో గాయపడ్డారు. 
 
ఇజ్రాయిల్‌ దళాలు అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌ను ఉల్లంఘించి ఈ దారుణానికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడి కావాల‌నే జరిగిందని ఈ అంశంలో అంత‌ర్జాతీయ స‌మాజం జోక్యం చేసుకోవాల‌ని అల్ జ‌జీరా విజ్ఞప్తి చేస్తోంది. 
 
షిరీన్ ప్రెస్ వెస్ట్, హెల్మెట్ ధరించినా ఆమె తలపై తుపాకీతో కాల్చడంతోనే మరణించారని ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కామెంట్స్ చేశారు. 
 
ఇజ్రాయిల్ ఈ ఆరోపణలను ఖండించింది. పాలస్తీనా గన్ మెనే షిరీన్‌పై కాల్పులు జరిపి వుంటారని పేర్కొంది. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది.