శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (13:07 IST)

నా భర్త... ఆయన ప్రియురాలే మా చావులకు కారణం...

తమ చావులకు కట్టుకున్న భర్తతో పాటు ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళే కారణమని ఓ మహిళ ఆరోపిస్తూ, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. తన భర్త చేష్టలతో విసిగిపోయిన తాము.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చివరగా వాట్సాప్ సందేశం పంపించి బలవన్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులోని హనుమంతనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సిద్ధయ్య, రాజేశ్వరి (40) అనే వారికి గత 18 యేళ్ల క్రితం వివాహం కాగా, వీరికి మానస(17), భూమిక(15) అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అయితే సెక్యూరిటీ ఉద్యోగం చేసే సిద్ధయ్యకు గత మూడేళ్ల నుంచి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె మాయలోపడి కట్టుకున్న భార్యా పిల్లలను పట్టించుకోవడం మానేశారు. దీంతో రాజేశ్వరికి, సిద్ధయ్యకు మధ్య తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. 
 
సిద్ధయ్య ప్రవర్తన నచ్చని రాజేశ్వరి తనువు చాలించాలని నిర్ణయించుకుంది. ఆదివారం రాత్రి భర్త ఇంట్లో నుంచి బయటకెళ్లిన తర్వాత.. రాజేశ్వరి, ఆమె ఇద్దరు పిల్లలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కంటే ముందు.. తమ జీవితాలను తన భర్త నాశనం చేశాడని, తమ చావుకు సిద్ధయ్య, ఆయన ప్రియురాలే కారణమని వాట్సాప్‌ స్టాటస్‌ పెట్టింది. 
 
ఇక ఆదివారం రాత్రి నుంచి మరుసటి రోజు కూడా ఇల్లు తెరవకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సిద్ధయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.