మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (19:47 IST)

సీఎన్ఎన్ టీవీ యాంకర్‌కు కరోనా... నా చిట్టి తమ్ముడిని రక్షించుకోలేకపోతున్నా..

సీఎన్ఎన్ టీవీ యాంకర్‌ క్రిస్ క్యూమోకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఐసోలేషన్ వార్డుకు తరలించారు. దీనిపై న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నా చిట్టి తమ్ముడిని రక్షించుకోలేకపోతున్నా అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆండ్రూ క్యూమో స్పందిస్తూ, తన తమ్ముడు, సీఎన్‌ఎన్‌ టీవీ న్యూస్‌ యాంకర్‌ క్రిస్‌ క్యూమో మహమ్మారి కరోనా వైరస్‌ బారినపడ్డారని తెలిపారు. ఈ ప్రాణాంతక వైరస్‌ ఎవరికైనా సోకుతుంది.. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
 
'నా చిట్టి తమ్ముడిని రక్షించుకోలేకపోతున్నా. తనను తాను కూడా కాపాడుకోలేడు. ఇది చాలా భయంకరంగా ఉంది. తన పరిస్థితి గురించి ఆందోళనగా ఉంది. మనం ప్రేమించే వాళ్లకు ఇలా జరిగితే అందరం ఇలాగే విచారిస్తాం కదా. తమ్ముడు ఐ లవ్‌ యూ. ధైర్యంగా ఉండు' అంటూ ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. 
 
కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌ ధాటికి అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఈ అంటువ్యాధి కారణంగా బుధవారం ఒక్కరోజే 884 మంది మృతిచెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 5000 దాటింది. ముఖ్యంగా న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. 
 
మహమ్మారి దెబ్బకు ఇప్పటికే వెయ్యికి పైగా న్యూయార్క్‌ పౌరులను కోల్పోయామని గవర్నర్‌ ఆండ్రూ క్యూమో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యూయార్క్‌ పరిస్థితి బాగా లేదని.. వైద్య సిబ్బంది స్వచ్చందంగా ముందుకు వచ్చి తమకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో దాదాపు 80 వేల మంది రిటైర్డు డాక్టర్లు, నర్సులు ఆపత్కాలంలో మద్దతుగా నిలిచేందుకు ముందుకు వచ్చారని ఆండ్రూ క్యూమో తెలిపారు.